రాయలసీమకు రెండు వరాలు ప్రకటించిన నరేంద్రమోడీ
రాయలసీమకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని అనంతపురం మీదగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. యశ్వంత్ పూర్-గయ-యశ్వంత్ పూర్ (06217, 06218), యశ్వంత్ పూర్- హౌరా-యశ్వంత్ పూర్ (02864, 02863) రైళ్లను తిప్పుతున్నారు. అనంతపురం మీదగా రెండు రైళ్లను నడుపుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమపై దయతలిచి రెండు వరాలు ప్రకటించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. రైల్వే జోన్ లేదు.. రెండు రైళ్లు తిప్పుతూ చేతులు దులుపుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
యశ్వంత్ పూర్ నుంచి గయకు
యశ్వంత్ పూర్ నుంచి గయకు వెళ్లే రైలు యశ్వంత్ పూర్ లో ప్రతి శనివారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.25 గంటలకు అనంతపురం చేరుకొని అక్కడినుంచి రాత్రి ఎనిమిది గంటలకు కాచిగూడ, తర్వాత రోజు రాత్రి 7.30 గంటలకు గయ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ప్రతి ఆదివారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి జబల్ పూర్, నాగపూర్, కాచిగూడ, కర్నూలు మీదగా అనంతపురంకు సాయంత్రం 4.40 గంటలకు చేరుకుంటుంది. రాత్రి పదిగంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. ఈ రైలుకు మొత్తం 26 స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది.

యశ్వంత్ పూర్ నుంచి హౌరాకు
02864 ప్రత్యేక రైలు ప్రతి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు యశ్వంత్ పూర్ లో బయలుదేరి ఉదయం 9.30 గంటలకు అనంతపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి డోన్, నంద్యాల, గిద్దలూరు, గుంటూరు మీదగా విజయవాడకు సాయంత్రం 6.25 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి విశాఖపట్నం, విజయనగరం, కటక్ మీదగా మధ్యాహ్నం 1.25 గంటలకు హౌరా చేరుకుంటుంది. 02863 నెంబరు రైలు తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరా నుంచి బయలుదేరి ఉదయం 7.25 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. డోన్ మీదగా అనంతపురంకు రాత్రి 7.30 గంటలకు వస్తుంది. యశ్వంత్ పూర్ కు రాత్రి 12.15 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలుకు కూడా మార్గమధ్యంలో 26 స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.












Click it and Unblock the Notifications