పారిశ్రామికవేత్త రాహుల్ది హత్యే: ఫోర్డు కారులో మృతదేహం, వాటా కోసం రౌడీ షీటర్, భాగస్వామి ఘాతుకం
అమరావతి: విజయవాడలో పార్క్ చేసిన కారులో మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ మృతదేహం పారిశ్రామిక వేత్త కరణం రాహుల్(29) అని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన వివాదమే ఆయన హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్య కేసులు నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కరణం రాహుల్ను మాట్లాడుకుందామని పిలిచి..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కెనడాలో చదివిన కరణం రాహుల్ స్వదేశానికి వచ్చారు. పోరంకిలో నివాసం ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్ రావడంతో బుధవారం రాత్రి 7.30 గంటలకు రాహుల్ తన కారులో బయటికి వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

తెల్లసరికి కారులో శవమై రాహుల్.. భోరుమన్న కుటుంసభ్యలు
ఆ తర్వాత రోజు గురువారం తెల్లవారినా కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో రాహుల్ కుటుంబసభ్యులో ఆందోళన చెందారు. రాహుల్ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే వైర్లెస్ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన మాచవరం ఇంఛార్జీ ఎస్ఐ సత్యనారాయణ, సెంట్రల్ ఏసీపీ ఖాదార్ బాషా ఘటనా స్థలానికి వెళ్లారు. విగత జీవిగా పడివున్న రాహుల్ను అతడి తండ్రి రాఘవ గుర్తించాడు. కన్నీరుమున్నీరుగా విలపించాడు. కారు డోర్ లాక్ తెరుచుకోకపోవడంతో మెకానిక్ల సాయంతో అద్దాలు పగలగొట్టి మృతదేహాన్ని బయటికి తీశారు.

దిండు, తాడుతో హత్య చేసిన ఆ నలుగురు
వాహనంలో తాడు, దిండు ఉండటంతో రాహుల్ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. తెలిసినవారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యులను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. కాగా, సిలిండర్ల తయారీ కంపెనీలోని ముగ్గురు భాగస్వాముల్లో ఇద్దరు స్థానికంగా ఉండటం లేదు. ఒకరి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం బలపడింది. మృతుడి కుటుంబసభ్యులు కూడా ఆ వ్యక్తి పేరు చెప్పడంతో పోలీసులు అతడే హంతకుడని నిర్ధారించుకున్నారు. రాహుల్ హత్య కేసులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కోరాడ విజయ కుమార్, అతడి భార్య పద్మ, మరో మహిళ గాయత్రి, రౌడీ షీటర్ కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు నిర్ధారించి, వారి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు పోలీసులు. రాహుల్ హత్యకు ప్రధాన సూత్రధారి రౌడీషీటర్ కోగంటి సత్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందతుల కాల్ డేటా విశ్లేషణ, బాధిత కుటుంసభ్యులు తెలిపిన అంశాలతో ఈ విషయాన్ని ఖరారు చేసుకున్నారు.
Recommended Video

రాహుల్ హత్యలో కీలకంగా రౌడీషీటర్ కోగంటి సత్యం
ఇక హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఎవరెవరు ఉన్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎన్నికల్లో ఓడిపోయిన విజయ కుమార్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. తన వాటా తీసుకుని డబ్బులు ఇవ్వాలని కొంత కాలంగా రాహుల్ను అడుగుతున్నాడు. తన వద్ద అంత డబ్బు లేదని రాహుల్ చెప్పగా.. మొత్తం తానే తీసుకుంటానని కోగంటి సత్యం ముందుకొచ్చాడు. అయితే, అందుకు రాహుల్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి చర్చించుకుందామని రాహుల్ను పిలిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. కారులో రాహుల్ కాకుండా మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ సీట్లో ఉన్న రాహుల్ చేతులను వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు వెనక్కి లాగి విరిచి పట్టుకోగా, పక్కన కూర్చున్న వ్యక్తి ముఖంపై దిండు నొక్కడంతో చనిపోయి ఉండవచ్చని నిర్ధారించుకున్నారు. తాడుతోనూ ఉరి బిగించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications