నిన్న చీమకుట్టి, నేడు ఆసుపత్రిలో శిశువు మాయం, సీఎం ఆగ్రహం
విజయవాడ: బెజవాడలోని పాత ఆసుపత్రిలో గురువారం నాడు శిశివు మాయమైంది. ఆ శిశువు ఇంక్యుబేటర్లో ఉంది. ఆమెను తాము చూసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది తల్లికి చెప్పారు. ఆమెను బయటకు పంపించారు. అంతలోనే శిశువు మాయమయిందని చెబుతున్నారు.
కొత్తపేటకు చందిన సుబ్రహ్మమ్యం, కళ్యాణి దంపతులు వారం రోజుల క్రితం జన్మించిన తమ కుమారుడికి కామెర్లు సోకడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని నవజాతు శిశు చికిత్సా కేంద్రంలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శిశువును నాలుగు రోజులుగా ఇంక్యుబేటర్లో ఉంచారు.
అయితే, గురువారం ఉదయం ఆ శిశువును ఎవరో ఎత్తుకుపోయారు. దీని పైన అక్కడి సిబ్బందిని అడిగితే నోరు మెదపడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ చిన్నారని తీసుకు వెళ్లిందని కొందరు చెబుతున్నారు. ఆసుపత్రిలో సిసి కెమెరాలు కూడా లేకపోవడంతో ఎవరు తీసుకెళ్లారనే విషయం తెలియడం లేదు.
ఆగ్రహం, విచారణకు కామినేని ఆదేశం
శిశువు మాయం కావడంపై ఆసుపత్రిలో ఉన్న పలువరు వ్యక్తులు, బంధువులు వైద్యుల పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ఆసుపత్రిలో చీమ కుట్టి ఓ శిశువు మృతి చెందాడని, ఇప్పుడు శిశువు మాయమయ్యాడని, ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని కొందరు ధ్వజమెత్తారు.
ఈ ఆసుపత్రికి గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస రావు వచ్చారని, కానీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేని విషయం దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి పేదల ఆరోగ్చయం పట్టదా అని ఆవేదన వ్యక్తం చేశారు. లోపలకు వచ్చి పిల్లలను ఎత్తుకెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, విషయం తెలియడంతో మంత్రి కామినేని దీనిపై విచారణకు ఆదేశించారు.