లేటెస్ట్ హాట్ టాపిక్: సిట్ బాస్ కొల్లి రఘురామ్ రెడ్డికి పదోన్నతి: డీఐజీగా.. ఇంటెలిజెన్స్లోనే!
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సీఐ విభాగం పోలీసు సూపరింటెండెంట్గా ఉన్న ఆయనకు ప్రభుత్వం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా పదోన్నతి ఇచ్చింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసినన జీఓలో అందరి దృష్టినీ ఆకర్షించిన పేరు అది. ఎందుకంటే- ప్రస్తుతం కొల్లి రాఘురామ్ రెడ్డి- చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న ఇన్సైడర్ ట్రేడింగ్ సహా కొన్ని కీలక నిర్ణయాలపై విచారణ చేపట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వాన్ని వహిస్తున్నారు గనక.
అటు ప్రత్యేకాధికారాలు.. ఆ వెంటనే పదోన్నతి..
సిట్ చీఫ్గా బాధ్యతలను స్వీకరించిన కొద్దిరోజుల వ్యవధిలోనే జగన్ సర్కార్ ఆయనకు పదోన్నతి కల్పించడంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో లేటెస్ట్ హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు ప్రారంభదశలోనే ఆయనకు పదోన్నతి కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్కు ప్రత్యేకాధికారాలు కల్పించింది. రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఏ జిల్లాలోనైనా, ఎవరినైనా పిలిచి విచారించడానికి అవసరమైన అధికారాలను అప్పగించింది.
సిట్లో ఏరికోరి
అదే సమయంలో ఆయనకు పదోన్నతి కల్పించడంలో చర్చనీయాంశమైంది. కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్లో విశాఖపట్నం ఎస్పీ అట్టాడ బాబూజీ, ఇంటెలిజెన్స్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, కడప అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఎస్పీ జయరామరాజు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డీఎస్పీ విజయ్ భాస్కర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఎం.గిరిధర్, ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ కెనడీ, నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, గుంటూరు జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
Recommended Video
ఆయనే ఎందుకంటే..
2014 ఎన్నికల సమయంలో రఘురామ్ రెడ్డి కర్నూలు ఎస్పీగా పనిచేశారు. అప్పట్లో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆయన డెప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆయన మళ్లీ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. వివిధ ఆర్థికపరమైన నేరాలపై దర్యాప్తు సాగించిన అనుభవం రఘురామ్ రెడ్డికి ఉంది. ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తారనే పేరుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు భావిస్తోన్న అవకతవకలన్నీ ఆర్థికమైనవే కావడంతో జగన్ ఏరికోరి ఆయనను సిట్ చీఫ్గా నియమించారని చెబుతున్నారు.