ఏపీలో కీలక పరిణామం- సీపీఐ ఆఫీసుకు పీసీసీ ఛీఫ్-మళ్లీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ?
ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నామమాత్రంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీ తమ పాత మిత్రులైన కమ్యూనిస్టుల్ని తిరిగి చేరదీసే ప్రయత్నం చేసింది. పీసీసీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఇవాళ విజయవాడలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో భేటీ అయ్యారు. ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇతర నాయకులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాదర స్వాగతం పలికారు. ఇరు పార్టీ ల నేతల మధ్య ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. అనంతరం మాట్లాడిన పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు.. ఏపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కామన్ ఎజెండాతో పని చేశాయని గుర్తుచేశారు. గతంలో అనేక అంశాలలో కలిసి పనిచేశామన్నారు. సిపిఐ రామకృష్ణతో సహా అనేక మందితో విద్యార్థి దశలో కలిసి నడిచినట్లు గిడుగు గుర్తుచేసుకున్నారు. అయితే భవిష్యత్తు రాజకీయాలపై చర్చ తప్ప, ప్రణాళికలు ఏమీ లేవని గిడుగు రుద్రరాజు తెలిపారు. సీనియర్ నేతగా రామకృష్ణ సలహాలు, సూచనలు తీసుకుంటానన్నారు.
మరోవైపు సమస్యలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి గిడుగు రుద్రరాజు అని సీపీఐ రామకృష్ణ తెలిపారు. దేశ రాజకీయ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని, భావ సారూప్యత ఉన్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. అతి పెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. లౌకిక శక్తులను ఏకం చేసి బీజేపీని ఓడించాలని తమ పార్టీ జాతీయ మహా సభల్లో తీర్మానం చేశామన్నారు.2024లో విభేదాలు పక్కన పెట్టి లౌకిక పార్టీలు కలవాలని రామకృష్ణ కోరారు. మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగానికే ప్రమాదం వాటిల్లుతుందన్నారు.
ఐక్యతతో ఫ్యాక్షనిస్టు, మతీన్మాద పార్టీలను తరిమి కొట్టాలని రామకృష్ణ కోరారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని పూర్తి గా దివాళా తీయించారని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కలిసి పోరాటం చేస్తామన్నారు.నిరసన కార్యక్రమం చేపట్టకుండా నోరు నొక్కేలా కుట్ర చేస్తున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా మోడీ మోసం చేస్తున్నా జగన్ అడగలేక పోతున్నారని రామకృష్ణ తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పోరాడతామని ఆయన ప్రకటించారు.