ఏఓబీ ఎన్కౌంటర్ : పోలీసులు మాటు వేసిన చోట కండోమ్స్!
విశాఖ : చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ కౌంటర్ పై ఇప్పటికీ ప్రజా సంఘాలు అనుమానాలు లేవనెత్తుతుండగా.. ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. అసలు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో నిజమైన పరిస్థితులను అంచనా వేసేందుకు.. పలువురు విద్యార్థులతో కూడిన ఓ నిజ నిర్ధారణ బృందం ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోకి అడుగుపెట్టింది. ఈ సందర్బంగా విద్యార్థులు అక్కడినుంచి పలు కీలక ఆధారాలు సంపాదించగలిగారు.
ముఖ్యంగా పోలీసులు మాటు వేసివున్న ప్రాంతంలో పలు మద్యం సీసాలతో పాటు కండోమ్స్ దొరకడం అనుమానాలను రేకెత్తిస్తోంది. నిజ నిర్థారణ పర్యటనలో భాగంగా ముందుగానే ఏపీ ఒడిశా డీజీపీలకు సమాచారమందించినా.. విశాఖ ఎస్పీ మాత్రం తమకు సమాచారం లేదంటూ ప్రకటించడం పట్ల విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజనిర్ధారణ కోసం వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి.
నిజ నిర్ధారణలో భాగంగా.. సేకరించిన వివరాలన్నింటిని హైదరాబాద్ కు వచ్చాక వెల్లడిస్తామని నిజ నిర్ధారణ కమిటీ వెల్లడించింది.