సిబిఐ విచారణ చేపట్టండి: బిజెపికి రాజేంద్రప్రసాద్; టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ: తులసిరెడ్డి
విజయవాడ: బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహరావు టిడిపి ప్రభుత్వంపై చేసిన ఆరోపణల కాష్టం రగులుతూనే ఉంది. పిడి అకౌంట్లకు సంబంధించి జివిఎల్ ఈ ఆరోపణలు చేసిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనపై దుమ్మెత్తిపోస్తుండగా, అందుకు జివిఎల్ కూడా ధీటుగానే కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఎంపి జీవీఎల్ ఆరోపణలపై తాజాగా టిడిపి ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఎంపి జీవీఎల్ పొద్దెరగని పిచ్చోడని, ఏది పడితే అది వాగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అంశాన్ని దారి మళ్లించేందుకే జీవీఎల్ తప్పుడు ప్రచారానికి దిగారని జివిఎల్ ఆరోపించారు. జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
బిజెపి ఎంపి ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీయే కాబట్టి సీబీఐ విచారణ చేపట్టమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ భారతీయ జనతా పార్టీకి సలహా ఇచ్చారు. అయితే వీటితో పాటు పీడీ యాక్టు, రాఫెల్ స్కామ్పై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు టిడిపి, బిజెపిలపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శల విర్షం కురిపించారు. టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ అని...బీజేపీ అంటే బరితెగించిన జనతా పార్టీ అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టిడిపి-బిజెపి రెండు పార్టీల మధ్య సవతుల పోరు ఎక్కువైందని అవహేళన చేశారు.
ఈ ఇరు పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వీరెవ్వరితో ఎపి రాష్ట్రాభివృద్ది సాధ్యంకాదని, సీమాంధ్ర...స్వర్ణాంధ్ర కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధికారంలోకి రావాలని తులసిరెడ్డి స్పష్టం చేశారు.