ప్రత్యేక హోదా: కేంద్రం ప్రశ్నలకు బాబు వద్ద సమాధానం లేదా?
విజయవాడ: ప్రత్యేక హోదా, నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీకి అడ్డంగా దొరికిపోయారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై ఎదురుదాడి చేయవద్దని పార్టీ నేతలను ఆదేశించడం నుంచి నిధుల వరకు బాబు చిక్కుల్లో పడ్డారంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం, కేంద్రమంత్రులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి టిడిపి బయటకు రావాలని, చంద్రబాబు తన కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలని, హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దామని చంద్రబాబుకు విపక్షాలు సూచిస్తున్నాయి.
ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పిన తర్వాత టిడిపి నేతలు బిజెపి పైన భగ్గుమన్నారు. కేంద్రంపై నమ్మకం పోయిందని, కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా మోసం చేసిందని, ఆ పార్టీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టిడిపి నేతలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.
అయితే, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని ఒక్క దానిని కార్నర్ చేయవద్దని, పరుషంగా మాట్లాడవద్దని చంద్రబాబు పార్టీ సీనియర్లకు సూచించారు. అయితే, కేంద్రం హోదా ఇవ్వమని తేల్చినప్పటికీ చంద్రబాబు పార్టీ సీనియర్లకు అలా ఆదేశించడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రతి అంశంలోను నిధుల నుంచి హోదా వరకు చంద్రబాబు బీజేపీ చేతికి చిక్కారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రం వేసే ప్రశ్నలకు కూడా చంద్రబాబు వద్ద సమాధానం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రాజధాని నిర్మాణానికి రూ.2,050 కోట్లు ఇచ్చామని, ఇంకా రాజధాని నిర్మాణానికి సంబంధించి తొలి అడుగు పడలేదని, కారణమేమిటని కేంద్రం ప్రశ్నిస్తోందని అంటున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టుకు కావాల్సినన్ని నిధులు ఇస్తామని, కానీ ప్రాజెక్టు నిర్మాణంలో వేగం ఏదని కేంద్రం అడుగుతోందని చెబుతున్నారు.
ఇచ్చిన నిధులను ఖర్చు చేశాక.. అప్పటికి అభివృద్ధి కష్టంగా మారితే అప్పుడు హోదా అంశం కీలకమవుతుందని, అప్పటి దాకా ఆ అంశం అవసరం లేదని చెబుతున్నారని అంటున్నారు. అలాగే, పలు జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని బిజెపి గుర్తు చేస్తోంది.
అలాగే, ఏపీకి ఇస్తున్న నిధుల పైన కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఏపీకి సరిపోయే నిధులు ఇవ్వడం లేదనేది తెలుగుదేశం పార్టీ వాదన. అదే సమయంలో ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుత ఏపీ పరిస్థితి వల్ల కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. విభజన నేపథ్యంలో ఏపీ ఎన్నో ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి దూరం జరిగితే రావాల్సిన ఆర్థిక సాయం కూడా ఉండదు. కాబట్టి చంద్రబాబు బీజేపీకి దూరం జరిగే పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనిపించదు.
అయితే, బీజేపీ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానాలు లేవనేది ఇటు ఏపీ బీజేపీ, అటు విపక్షాల వాదన. నిధులు పక్కదారి పట్టిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టులో వేగం లేదని, అవసరమైన, చట్టంలోని హామీ మేరకు నిధులు ఇస్తున్నామని కేంద్రం చెబుతోంది.
హోదాపై కేంద్రం తేల్చేశాక బీజేపీ నేతలు పెద్దగా బయట కనిపించడం లేదు. కానీ కొందరు మాత్రం టిడిపి విమర్శలు గుప్పించినప్పుడు ధీటుగానే స్పందించారు. ఆ తర్వాత చంద్రబాబు పార్టీ సీనియర్లను బీజేపీని కార్నర్ చేయవద్దని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది వైసిపికి ఆయుధంగా కూడా మారింది.
ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంటు ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కు. ఆ హక్కు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాలు ఏపీకి హోదాపై మెలిక పెడుతున్నాయి. ఏపీకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని చెబుతున్నాయి. ఇదే ఇక్కడ వస్తున్న చిక్కు.
దానికి బీజేపీ వద్ద సమాధానం ఉంది. నాడు విభజన సమయంలో మన్మోహన్ ప్రభుత్వం సభలో హామీ ఇచ్చిందని, కానీ చట్టంలో పేర్కొనలేదని, ఇప్పుడు ఇదే సమస్య అయి కూర్చుందని కాంగ్రెస్ పార్టీని దనుమాడుతున్నారు.
విభజన చట్టంలో సెక్షన్ - 8 గవర్నర్కి విశేష అధికారాలను కట్టబెట్టింది. కొన్ని కారణాల వల్ల దానినే కేంద్రం అమలు చేయడం లేదని, అలాంటప్పుడు విభజన చట్టంలోని ప్రత్యేక హోదాని ఎలా అమలు చేయగలుగుతుందని కొందరు అంటున్నారు. కేంద్రంపై ఒత్తిడితోనే సాధ్యమని చెబుతున్నారు.
అంతర్జాతీయ రాజధాని పేరుతో రెండేళ్లు కాలయాపన చేశారని, లేదంటే అమరావతికి ఈపాటికే ఓ రూపు వచ్చి ఉండేదని కొందరు అంటున్నారు. దీనిని కేంద్రంలోని బీజేపీ ప్రశ్నించే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అదే సమయంలో తాత్కాలికం పేరుతో కొన్ని కట్టడాలను కూడా నిర్మించడాన్ని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.
పోలవరంలో వేగం లేదని, అంతర్జాతీయ రాజధాని పేరుతో కాలయాపన చేస్తున్నారని.. వీటికి తోడు 'తాత్కాలిక' నిర్మాణాలను కేంద్రం ప్రశ్నిస్తే చంద్రబాబు వద్ద సమాధానం లేదని అంటున్నారు. ఏపీలో తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇలాంటి వాటిని, శాశ్వతంగా కడితే, ఆ నిధులు కేంద్రం వాటాలో పడిపోయేవని, అప్పుడు మరిన్ని నిధులు కోరేందుకు అవకాశముండేవని అంటున్నారు. కానీ అవి తాత్కాలిక కట్టడాలు కాబట్టి వాటితో తమకు సంబంధం లేదని కేంద్రం చెప్పేందుకు కారణం ఉందని అంటున్నారు.
తాత్కాలికం అన్న పేరు పెట్టకుండా, ఇప్పుడు కడుతున్న వాటి కోసం ఇచ్చిన రూ.2,050 కోట్ల లెక్కేమిటని కేంద్రం ప్రశ్నిస్తోంది. పోలవరం విషయానికి వస్తే... పనులు వేగంగా జరగడం లేదని, అలాంటప్పుడు నిధులు రావాలంటే ఎలా అని అంటున్నారు. చంద్రబాబు తన చర్యలతో బీజేపీకి అవకాశం ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.