జూ.ఎన్టీఆర్ సైలెన్స్: జగన్కు ధీటుగా.. బాబుప్లాన్, నారా లోకేష్ మరో మెట్టు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. చంద్రబాబు వారసుడి రేసులో తొలుత జూ.ఎన్టీఆర్, నారా లోకేష్ల పేరు వినిపించింది. జూ.ఎన్టీఆర్ పేరు ఆ తర్వాత తెరమరుగైంది. జూనియర్ స్వయంగా రాకపోయినా, హరికృష్ణ వంటి వారు మాట్లాడారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
'చంద్రబాబుకు బెదిరింపు లేఖ ఓ ఎత్తుగడ, కొత్త మాటలు'
ఆ తర్వాత నుంచి పార్టీలో, ప్రభుత్వంలో నారా లోకేష్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తొలుత పార్టీకి పని చేశారు. కానీ ఏ పదవిలో లేరు. ఆ తర్వాత యూత్ వింగ్ హెడ్గా, పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఇప్పుడు ఆయనను కేబినెట్లోకి తీసుకుంటారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
నారా లోకేష్ను కేబినెట్లోకి తీసుకునే విషయమై చంద్రబాబు కూడా కొంత సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలోను ఆయనను వ్యతిరేకించే వారు ఎవరూ లేరు. స్వయంగా మంత్రులు కూడా ఆయనను కేబినెట్లోకి తీసుకుంటే మంచిదే అని అభిప్రాయపడుతున్నారు.
కేబినెట్ విస్తరణ చంద్రబాబు పరిధిలోని అంశమని ఆ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. లోకేష్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. లోకేష్ను తీసుకోవడం ఖాయమని చాలామంది తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు భావిస్తున్నారు.
పార్టీ సమన్వయకర్తగా, ట్రెజరర్గా లోకేష్ పార్టీకి పని చేశారు. గత ఏడాది పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. పార్టీ ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ పొలిట్ బ్యూరో అయ్యారు. పార్టీలో వరుసగా మెట్లు ఎక్కిన లోకేష్.. ఇక ప్రభుత్వ పరంగా రంగంలోకి దిగాల్సిందేనని టిడిపి భావిస్తోంది.
ఇందులో భాగంగా త్వరలో జరగనున్న విస్తరణలో ఆయనకు చోటు కల్పించనున్నారని అంటున్నారు. 2019 నాటి ఎన్నికలలో ఆయన పోటీ చేస్తారని, మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. 2019లో టిడిపి మళ్లీ గెలిస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక.. లోకేష్కు ఇటు పార్టీ, అటు కేబినెట్లో మరింత ప్రాధాన్యత గల శాఖ ఇచ్చినా, సమర్థవంతంగా నిర్వహించేలా లోకేష్ను తయారు చేసేందుకు బాబు చూస్తున్నారంటున్నారు. 2019కి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జగన్కు ధీటుగా తయారు చేయనున్నారని అంటున్నారు.