టిఆర్ఎస్ హామీతోనే కెసిఆర్ని ఇరుకున పెట్టాలని బాబు చూస్తున్నారా?
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన హామీతో... ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయననే ఇరుకున పెట్టాలని చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
ఆయన బుధవారం తెలంగాణలోని పాలమూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. ఆదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే మూడేళ్లలో ఏ ఆడబిడ్డయినా మంచినీటి కోసం రోడ్డెక్కితే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్ ఒక్కరేనని, దీనిని అదునుగా భావించిన చంద్రబాబు వాటర్ గ్రిడ్ పథకాన్ని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు.
తెలంగాణలో పలు ప్రాజెక్టులు అక్రమమని, వాటిని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం పలుమార్లు రివర్ బోర్డులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ... పైవ్యాఖ్యలు చేశారు.
తద్వారా, వాటర్ గ్రిడ్ పథకం విఫలమైతే కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగలేరనే అభిప్రాయం చంద్రబాబులో ఉందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు.
జీవనదుల అనుసంధానం ఓ చారిత్రక ఘట్టం: చంద్రబాబు
గోదావరి-కృష్ణా జీవనదుల పవిత్ర అనుసంధానం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన పట్టిసీమ ప్రాజెక్ట్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి పంప్ హౌస్ను పరిశీలించి పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను కరవు నుంచి పారద్రోలాలన్నదే తన లక్ష్యమన్నారు. తన సంకల్పాన్ని సాధించేందుకు మంత్రులు, అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి పట్టిసీమ ప్రాజెక్ట్ను పూర్తి చేశారన్నారు.
డబ్బు కంటే నీరు ఎంతో విలువైందన్నారు. జల వనరులను కాపాడుకోలేకపోతే మానవ మనుగడే కష్టమన్నారు. ఈ రోజును తాను మర్చిపోలేనని, తన జన్మ చరితార్థమయిందన్నారు. వర్షపు నీటిని సంరక్షించడంపై ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు.