ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కాణిపాకం వినాయక ఆలయంలో క్వారంటైన్: అవునంటోన్న ఐవైఆర్
చిత్తూరు: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరగడానికి కారణమైనట్టుగా అనుమానిస్తోన్న ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో కొందరిని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో క్వారంటైన్ ఏర్పాటు చేశారని భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.
చిత్తూరు సమీపంలో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక ఆలయంలో ప్రస్తుతం మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఆలయంలో భక్తుల సందర్శనను నిలిపివేశారు. స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ దాడి తీవ్రతరమైన నేపథ్యంలో ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన భవనాల్లో క్వారంటైన్ను ఏర్పాటు చేశారు.

కరోనా పాజిటివ్గా గుర్తించినా లేదా, అనుమానితుడిగా భావించినా.. వెంటనే ఈ క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండువేలకు పైగా క్వారంటైన్ కేంద్రాలను నెలకొల్పింది. దీనికోసం ప్రతి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో వాటిని ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లాలోని ప్రతిష్ఠాత్మక కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని కూడా క్వారంటైన్గా మార్చివేశారని, ఒక వర్గానికి చెందిన ప్రజలకు అక్కడ చికిత్స అందిస్తున్నారని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఆలయ ప్రాంగణమా లేక వసతి సదుపాయమా? మరి ఇంకెక్కడా వసతి లేనట్టు దీనిని అన్యమతస్తుల కోసమే వాడటంలో గల భావము ఏంది?
— IYRKRao , Retd IAS (@IYRKRao) April 6, 2020
ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన చిత్తూరు జిల్లావాసులను అక్కడ ఉంచారని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అత్యంత సున్నితమైన ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. కాణిపాకం ఆలయ ప్రాంగణమా లేక వసతి సదుపాయమా? అని ధ్వజమెత్తారు. ఇంకెక్కడా వసతి లేనట్టు హిందువులు ఆరాధించే కాణిపాకం వినాయక స్వాయి ఆలయంలో అన్యమతస్తుల కోసమే వాడటంలో వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు.












Click it and Unblock the Notifications