ఆశలు వదులుకున్న చంద్రబాబు: హైదరాబాద్కు వీడ్కోలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్పై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తున్నారు. హైదరాబాద్కు ఆయన శాశ్వతంగా వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాదు నగరం అందరిదని, తానే హైదరాబాదును అభివృద్ధి చేశానని చెబుకుంటూ వస్తున్న ఆయన ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో పూర్తిగా నిరాశకు గురైనట్లు కనిపిస్తున్నారు.
జూన్ 15వ తేదీ నుంచి ఆయన పూర్తిగా విజయవాడలోని తాత్కాలిక రాజధాని నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా పూర్తిగా విజయవాడకు మార్చాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.
దన్నం పెట్టి చెబుతున్నా, అడ్డంకులు సృష్టించొద్దు: చంద్రబాబు
పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన మంత్రివర్గ సహచరులకు, ఎపి పార్టీ అధ్యక్షుడు కె. కళావెంకట్రావుకు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి విజయవాడకు మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత చంద్రబాబు హైదరాబాదుతో ఉండే సంబంధం కేవలం ఎన్టీఆర్ ట్రస్టు మాత్రమే. ఎన్టీఆర్ ట్రస్టు వ్యవహారాలను ఆయన తన సతీమణి భువనేశ్వరికి, కోడలు బ్రాహ్మణికి అప్పగిస్తారని అంటున్నారు. తాత్కాలిక రాజధానికి చంద్రబాబునాయుడు బుధవారంనాడు శంకుస్థాపన చేశారు.