ఎన్నికల్లో నినాదం ఇదేనా: తెరాస సిఎం అభ్యర్థి కెసిఆర్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్.. అనే నినాదంతో రానున్న ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలనే యోచనలో తెరాస అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దిశగా ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోందట. దీనిపై ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారంటున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తామని కెసిఆర్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు కెసిఆర్ సిఎం నినాదం తెర పైకి రావడంతో.. తొలి సిఎం దళిత సిఎం హామీ విషయంలో పార్టీ యూ టర్న్ తీసుకుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తెరాస ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని, పక్కా రాజకీయ పార్టీ అని, ఇకపై తమ ఆలోచనలు, భాష అన్నీ రాజకీయంగానే ఉంటాయని కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తొలి దళిత సిఎం విషయమై విలేకరులు ప్రశ్నిస్తే... దళిత సిఎం వ్యవహారం ఇప్పుడెందుకని, దానిని ఎన్నికల తర్వాత చూస్తామని ఆయన దాట వేశారు. ఇటీవల కాలంలో పార్టీ ముఖ్యులు చాలా మంది కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం చేసుకుందామని చెబుతున్నారు.
కాంగ్రెస్లో తెరాస విలీనం ప్రస్తావన వచ్చినప్పుడు, కెసిఆర్కు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తేనే విలీనంపై ఆలోచిస్తామని అన్నారు. ఈ క్రమంలో పార్టీ సిఎం అభ్యర్థి కెసిఆర్ అనే నినాదంతో ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే విషయంలో పార్టీకి చెందిన పలువురు యోచిస్తున్నారట.