3 రాజధానులు..9 నెలల పాలనకు రెఫరెండంగా: ప్రత్యర్థులను ప్రజాస్వామ్యబద్ధంగా బలహీనపర్చేలా..!
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జిల్లాల బాట పట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమాలుగా మలచుకుంటోంది. భారతీయ జనతాపార్టీ-జనసేన ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకునే పనిలో పడ్డాయి.
ఎన్నికల వేళ వైసీపీ మరో సంచలనం: నిన్న బీసీలకు రిజర్వేషన్లు.. నేడు?: టీడీపీ ఫాలో కావాల్సిందేనా?
జగన్ పరిపాలనకు రెఫరెండంగా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా తీసుకుంటోంది వైఎస్ఆర్సీపీ. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల అనంతరం గ్రామస్థాయిలో నిర్వహించబోతున్న ఈ ఎన్నికలను ప్రజాభిప్రాయ సేకరణ కోసం వేదికగా మలచుకుంటోంది.. తమ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే విషయంపై ఈ ఎన్నికలను ఓ గీటురాయిగా భావించాలని వైఎస్ జగన్ తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు తెలుస్తోంది.
ప్రజల నాడి తెలుసుకోవడానికి..
రాష్ట్రంలో తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ప్రజల నుంచి నిఖార్సయిన అభిప్రాయాన్ని తీసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయని వైఎస్ జగన్ మంత్రులకు సూచించినట్లు చెబుతున్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా లబ్దిదారుల ఇంటి వద్దకే చేర్చుతున్నామని, అవినీతికి అవకాశమే లేని విధంగా పరిపాలన సాగిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారని అంటున్నారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ప్రత్యర్థులను బలహీనపర్చాలనే వ్యూహం..
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను నిర్వహించడం ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థులను బలహీనపర్చాలనే పట్టుదల వైఎస్ జగన్లో కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారంటూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు చేస్తోన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా నిరూపించాల్సి ఉంటుందని మంత్రులు భావిస్తున్నారు.
90 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకోవాలనే టార్గెట్..
గ్రామస్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో 90 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంటుందని జగన్.. మంత్రులకు టార్గెట్ పెట్టడానికి ప్రధాన కారణం ఇదేనని చెబుతున్నారు. తమ పరిపాలన తీరును ప్రజలు ఆమోదించారనే విషయాన్ని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను మంత్రులపై పెట్టారు. తమ సొంత నియోజకవర్గాల్లో 90 శాతం వరకు స్థానాలను సాధించలేకపోతే పదవులను వదులుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.
Recommended Video
లక్ష్యాన్ని అందుకోగలిగితే.. స్వేచ్ఛగా..
90 శాతం మేర సీట్లను సాధించాలనే లక్ష్యాన్ని గనక సాధించగలిగితే.. రాజకీయ ప్రత్యర్థులు చేస్తోన్న వాదనలు, విమర్శలు, ఆరోపణల్లో ఏ మాత్రం పస లేదనే విషయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చేసినట్టు అవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో నెలకొంది. ప్రతిపక్ష టీడీపీ సహా బీజేపీ, జనసేన చేస్తోన్న విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవాల్సిన పని ఉండదని, స్వేచ్ఛగా పరిపాలనను కొనసాగించడానికి వీలు ఉంటుందని అధికార పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.