ఎవరేంటి?: జూఎన్టీఆర్ను లైట్గా తీసుకున్న బాబు, పవన్ కళ్యాణ్పై రివర్స్!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతుండటంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకు వచ్చారు.
ప్రత్యేక హోదా విషయమై పవన్ టిడిపి ఎంపీలను ఏకిపారేశారు. వారు ఎదురుదాడికి దిగితే, అందుకు కౌంటర్ కూడా ఇచ్చారు. పవన్ పైన టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు వారు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు.
అయితే, చంద్రబాబు నాడు జూనియర్ ఎన్టీఆర్ను, నేడు పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేశారని అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా జూ ఎన్టీఆర్ అసహనం, దూరాన్ని చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నారని, కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. టీడీపీ నేతలు పవన్ పైన విమర్శలు గుప్పించవద్దని హెచ్చరికల వంటి సూచనలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
జూ ఎన్టీఆర్
2009 ఎన్నికల సమయంలో (సమైక్య ఆంధ్రప్రదేశ్) జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి జోరుగా ప్రచారం చేశారు. తాత హావభావాలతో జనాలను అలరించారు. ఆయన ప్రచారం అందర్నీ ఆకట్టుకుంది. ప్రచారం చేసి తిరిగి వస్తూ ప్రమాదంలో గాయపడ్డారు కూడా.
రాజకీయ వారసత్వంపై లోకేష్ వర్సెస్ జూ ఎన్టీఆర్
టీడీపీలో వారసత్వంపై మూణ్ణాలుగేళ్ల క్రితం జోరుగా చర్చ సాగింది. ఆ సమయంలో జూ.ఎన్టీఆర్, లోకేష్ల పేర్ల పైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. జూనియర్ పేరును కొందరు తెరపైకి తీసుకు వచ్చారని, దానికి కౌంటర్గా టీడీపీ లోకేష్ పేరు తెరపైకి తీసుకు వచ్చిందనే వాదనలు ఉన్నాయి.
జూ ఎన్టీఆర్
రాజకీయ వారసత్వంపై జూనియర్ ఎన్టీఆర్కు లోకేష్ పోటీకి వచ్చారని ఊహాగానాలు వినిపించాయి. ఆ సమయంలో విభేదాలు పొడసూపాయి. హరికృష్ణ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత ఏపీలో ఓ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్లిన జూనియర్.. ఫ్యాన్స్ బలం చూపించే ప్రయత్నాలు చేశారనే వాదనలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలు
రాజకీయ వారసత్వం, ఆ తర్వాత విభేదాలు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేయలేదు. ఆయనకు ఆహ్వానం అందలేదని కొందరు అంటే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కోసం ఒకరు పిలవాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు చెప్పారు.
జూనియర్ను పక్కన పెట్టడంపై కొద్దిగా విమర్శలు
2009లో జూనియర్ను వాడుకొని, ఆ తర్వాత పక్కన పెట్టారని వైసీపీ వంటి పార్టీలు విమర్శలు గుప్పించాయి. అయితే ఆ వాదనలకు అంత బలం చేకూరలేదనే చెప్పవచ్చు. పార్టీలో రాజకీయ వారసత్వం కోసం జరిగిన పోరు, వైసీపీ రాజకీయ ఉద్దేశ్యంతో చేసిన విమర్శలుగా భఆవించడం వల్ల దానికి పెద్దగా స్పందన రాలేదనే చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ టీడీపీ - బీజేపీలకు మద్దతిచ్చారు. ఎన్నికల్లో మద్దతిచ్చే సమయంలోనే.. టీడీపీ, బీజేపీలు తప్పు చేస్తే ప్రశ్నిస్తానని పవన్ చెప్పారు.
పవన్ కళ్యాణ్కు అందరి అండ
తాను పూర్తిస్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని చెబుతూనే పవన్ కళ్యాణ్.. రాజధాని భూమి, ప్రత్యేక హోదా, సెక్షన్ 8 పైన వివిధ సందర్భాల్లో స్పందించారు. అయితే, ప్రత్యేక హోదా గురించి టీడీపీ నేతలను నాలుగు రోజుల క్రితం ఏకిపారేశారు. దీనిపై టీడీపీ ఘాటుగా స్పందించింది. అయితే, ఇప్పుడు పవన్కు వైసీపీ, సీపీఐ సహా ఇతర పార్టీల నుండి అండ లభిస్తోంది. ప్రజల కోసం, ఏపీ కోసం ఆయన ప్రశ్నించినందువల్లే మద్దతు లభిస్తోంది.