అధిష్టానం దోబూచులాట: కిరణ్తో భేటీకి సోనియా నో
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల కాంగ్రెసు అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలు ఆయనను కలుసుకోవడానికి కూడా ఇష్టంగా లేరని తెలుస్తోంది. తమ మాట వింటానని చెప్పి తిరుగుబాటు చేయడం పట్ల కిరణ్ కుమార్ రెడ్డిపై సోనియా కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టడానికి నిశ్చయించుకున్నట్లు చెబుతున్నారు.
నిజానికి ఆయన తన సొంత పార్టీని ఇప్పటికే పెట్టాల్సి ఉండింది. అయితే తెలంగాణపై అధిష్టానం నిర్ణయాన్ని మార్చగలమనే ఉద్దేశంతో ఆయన ఇంత కాలం ఆగినట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తూ సీమాంధ్ర వైపు మొగ్గుతూ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడాన్ని అధిష్టానం తిరుగుబాటుగానే భావిస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించాడని, లక్ష్మణ రేఖ దాటాడని భావిస్తున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్లు ఎత్తడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ఇష్టపడడం లేదని అంటున్నారు. గత వారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ఫరవాలేదనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఎఐసిసి అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ మాటల్లో కూడా అదే వ్యక్తమైంది.
ఢిల్లీ పర్యటనలో మాత్రం ఆయన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలుసుకోగలిగారు. అది కూడా డిజిపిగా దినేష్ రెడ్డి పదవీ కాలాన్ని పొడగించే విషయంపై మాత్రమే మాట్లాడారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఆయన మానానికి ఆయనను వదిలేసినట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు చాలా మంది సమైక్యాంధ్ర సింహంగా అభివర్ణిస్తున్నారు. ఇంతకు ముందు కొత్త పార్టీ పెట్టడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్ వల్ల వెనకాడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని, దానివల్ల జగన్ ఇమేజ్ తగ్గిందని భావిస్తున్నారని అంటున్నారు. దాంతో పార్టీ పెట్టడానికి ఇది అనువైన సమయమని కిరణ్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిజానికి, ఇటీవల విశాఖపట్నం పర్యటనలోనే తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టాలని ఆయన అనుకున్నారని సమాచారం. వంద కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని, ఆయన పెట్టుకున్నారు. ఆ కార్యక్రమానికి రూపొందించిన ప్రచార సామగ్రిలో కాంగ్రెసు మార్కు లేకుండా చూశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు రూపకల్పన చేశారు. సమైక్యాంధ్ర సింహంగా కిరణ్ రెడ్డిని అభివర్ణిస్తూ పోస్టర్లను రూపొందించారు. అయితే, గంటా శ్రీనివాస రావు అకస్మాత్తుగా ఆ కార్యక్రమాన్ని శనివారం ఉదయం రద్దు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితుల కారణంగానే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు గంటా శ్రీనివాస రావు చెబుతున్నారు. గంటా శ్రీనివాస రావుకు ఎక్కడి నుంచి ఏ విధమైన సూచనలు వచ్చాయో తెలియదు గానీ కార్యక్రమం మాత్రం రద్దయింది. ముఖ్యమంత్రితో తెగదెంపులు చేసుకోవడానికి 11 మంది సీమాంధ్ర మంత్రులు నిరీక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వారు అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications