జగన్ కుట్ర: వర్ల, జూ.ఎన్టీఆర్పై ఇప్పుడు కాదు: సుజన
బందరు పార్లమెంటు సీటు ఆశించిన కెఎన్ఆర్ మృతికి జగన్ కారణమని ఆయన ఆరోపించారు. బందరు పార్లమెంటు సీటు ఇవ్వడానికి జగన్ 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని ఆయన అడిగారు. పది కోట్లు ఇస్తానని అంటే జగన్ అంగీకరించలేదని, దాంతో మనస్తాపానికి గురై కెఎన్ఆర్ మరణించారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరు అని, అయితే ఆ గ్రామానికి ఎవరైనా రావచ్చునని, ఎవరినైనా పలకరించవచ్చునని, అయితే జగన్ ఆ ఊరికి రావడంలోని ఆంతర్యాన్ని ప్రజలకు తెలియజేయడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు.
ఎన్టీ రామారావు విగ్రహానికి జగన్ పూలమాల వేయాలని చూడడం శవరాజకీయాలు చేయడమేనని ఆయన అన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి జగన్ ఎందుకు పూలమాల వేస్తారని, తాము వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వేయడం లేదు కదా అని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తే తమ పార్టీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేస్తారని ఆయన చెప్పారు. అవినీతిపరుడైన జగన్ పూలమాల వేస్తే ఎన్టీఆర్ విగ్రహం మలినమవుతుందని వర్ల వ్యాఖ్యానించారు. కొడాలి నాని పాలు తాగి రొమ్ము గుద్దే రకమని ఆయన అన్నారు. నిమ్మకూరులోని ఎన్టీఆర్ బంధువు పెద వెంకటేశ్వర రావు చాలా కాలంగా ఎన్టీఆర్ కుటుంబంతో విభేదిస్తున్నారని ఆయన చెప్పారు.
కాగా, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పార్టీని వీడుతారా, లేదా అనేది చెప్పడానికి ఇది సరైన సమయం కాదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్కు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉందని, జూనియర్ ఎన్టీఆర్ తెలివితక్కువ నిర్ణయం తీసుకుంటారని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను పార్లమెంటులో అడ్డుకోవడానికి తాము ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.