ప్రభుత్వ సహాచర్యలు అంతత మాత్రమే.!వరదల్లో ప్రజలు గల్లంత్తవ్వడం బాధాకరమన్న జనసేన.!
అమరావతి/హైదరాబాద్ : రాష్ట్రంలోనెలకొన్న వరద పరిస్థితులు, తుపాను బీభత్సం, ముంచెత్తుతున్న వరదలు, అతలాకుతలమవుతున్న జనజీవన విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అనేక జిల్లాల్లో ఉదృతంగా ప్రవహిస్తున్న వరదలు వల్ల అనేక మంది నిరాశ్నయులయ్యారని, ఎంతో మంది ప్రజలు సర్వం పోగొట్లుకున్నారని, చాలా వరకు జనాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం సహాయక చర్యలపై జనసేనాని పెదవి విరిచారు. ముందుస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే ప్రాణనష్టాన్ని అరికట్టగలిగి ఉండే వాళ్లమని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పోటెత్తుతున్న వరదలు.. రెస్క్యూ టీంలు ఎక్కడని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
వివిధ జిల్లాల్లో కలెక్టర్ యంత్రాంగం గాని, తుపాను నివారణ సిబ్బంది గాని, విపత్తుల నివారణ బృందాలు గానీ ఎక్కడా కనిపించలేదని మండిపడ్డరు. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వ సహాయ చర్యలు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయని, యంత్రాంగం అంతా మొద్దు నిద్రపోతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల మూలంగా కడప జిల్లాలో చెయ్యేరు నది వరదలో 30 మంది గల్లంతయ్యారనే సమాచారం బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
30మంది కొట్టుకుపోవడం బాధాకరం.. యంత్రాగం అప్రమత్తంగా లేదన్న పవన్
వరదలో కొట్టుకుపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని చెయ్యేరు లోతట్టు ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొందని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా శివాలయంలో దీపారాధనకు వెళ్ళిన భక్తులు, పూజారి వరదలో చిక్కుకొని గల్లంతు కావడం హృదయవిదారకమని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇంతగా వరద ఉధృతి ఉంటుందని, అన్నమయ్య జలాశయం మట్టికట్ట పరిస్థితిని అధికార యంత్రాంగం ముందుగా అంచనా వేసి, ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదన్న పవన్ కళ్యాణ్.
వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ప్రజలు కొట్టుకుపోతున్నారన్న జనసేనాని
ప్రస్తుతం నెలకొన్న జల విలయం కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోందని, రైతాంగానికి కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లిందని పవన్ తెలిపారు. తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో వరదల మూలంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని, తిరుపతి నగరంలో పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయని, రహదారులు చెరువుల్లా ఉన్నాయని, ప్రజలు అనేక ఇబ్బందిపడుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి శాసన సభలో చిరునవ్వులు చిందింస్తున్నారని మండిపడ్డారు.
రంగంలో దిగిన జనసైనికులు.. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాలన్న పవన్
చిత్తూరు జిల్లాలో వందల గ్రామాలు వరద ముప్పునపడి ఉన్నాయని, భారీ వర్షాలు, వరదల వల్ల నెలకొన్న పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల జనసేన నాయకుల నుంచి పార్టీ కార్యాలయం సమాచారం తీసుకొంటోందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ప్రభుత్వ సాయంలో ఉదారంగా వ్యవహరించాలని, ఐన వారిని కోల్పోయిన వారిలో భయాందోళనలు తొలగించేలా ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం చేరవేయడం కూడా ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వరదల మూలంగా ఇబ్బందిపడుతున్నవారికి సాయంగా నిలవాలని జనసేన నాయకులకు, శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.