Chandrababu Naidu : చంద్రబాబు తొలిసారి సీఎం పదవి చేపట్టి 26 ఏళ్లు... కేక్ కట్ చేసి సెలబ్రేషన్...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి నిన్నటికి 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలు ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ అంగన్వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత,పార్టీ నేతలు పట్టాభిరామ్, పిల్లి మాణిక్యరావు, సయ్యద్ రఫీ, ఏవీ రమణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘం కాలం పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1995,సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పట్లో అనూహ్య పరిణామాల నడుమ ఎన్టీఆర్ పదవిని కోల్పోగా చంద్రబాబు సీఎం అయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.రాష్ట్ర విభజన తర్వాత తిరిగి 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో ఆయన అధికారానికి దూరమయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పారు.1996 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1999-2004 వరకు ఎన్డీయే కన్వీనర్గా వ్యవహరించారు.2003లో అలిపిరి వద్ద చంద్రబాబుపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో బయటపడ్డారు.
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎకనమిక్స్లో పీజీ పూర్తి చేసిన అనంతరం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 28 ఏళ్ల వయసులోనే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1983 ఎన్నికల్లో టీడీపీ విజయానంతరం చంద్రబాబు కాంగ్రెస్ను వీడి ఆ పార్టీలో చేరారు.ప్రస్తుతం 71 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ యువ నేతలకు స్పూర్తిగా నిలుస్తున్నారు.
నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరుపై సమీక్ష :
రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ఇన్చార్జిల పనితీరుపై చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.ఇన్చార్జిలు లేనిచోట ఇన్చార్జిల నియామకానికి కసరత్తులు చేస్తున్నారు. ఇన్చార్జిలు ఉండి.. అంతగా ప్రభావం చూపించిన చోట.. ఆయా నాయకులతో భేటీ అవుతున్నారు. వారికి కీలక సలహాలు,సూచనలు ఇస్తున్నారు. గురు,శుక్రవారాల్లో కడప జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఇన్చార్జి నాయకులతో చంద్రబాబు భేటీ కానున్నారు.