టీడీపీ- బీజేపీ దోస్తీ ఎంత కాలం: అప్పుడే భిన్న ప్రకటనలు
TDP BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని రెండు పార్టీల అధినేతలు అధికారికంగా వెల్లడించారు.
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా చర్చలు కొనసాగించడం, షరతులకు ఓకే చెప్పిన తరువాతే ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తు విషయంపై చర్చించారు. అవి ఫలించాయి.

ఆరు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్టాయి. ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహించబోతోన్నాయి. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నాయి.
ఈ పొత్తుపై తాజాగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ రెండు పార్టీల మధ్య బంధం ఎంతకాలం కొనసాగుతుందనే అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ బంధం సుదీర్ఘకాలం కొనసాగాలని రెండు పార్టీలు కోరుకుంటే ఎలాంటి గందరగోళానికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
తనంతట తానే ఎన్డీఏ కూటమిలో చేరడానికి తెలుగుదేశం.. బీజేపీ హైకమాండ్తో సంప్రదింపులు జరిపినట్లుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెబుతున్నారని, దీనికి పూర్తి భిన్నమైన ప్రచారాన్ని టీడీపీ చేపట్టిందని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. బీజేపీ ఆహ్వానించడం వల్లే రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏలో చేరామని టీడీపీ చెప్పుకొంటోందని అన్నారు.
ఈ రెండూ కూడా పూర్తి భిన్నమైన ప్రకటనలేనని ఐవైఆర్ చెప్పారు. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడానికి ఓ స్పష్టత ఏర్పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీడీపీ- బీజేపీ మధ్య ఏర్పడిన బంధం ఎక్కువ కాలం నిలవడానికి ఈ స్పష్టతే దోహదం చేస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications