బుగ్గనకు పీఏసీపై జగన్ ఎవరికీ చెప్పలేదు, షాకయ్యా: లాబీల్లో గుసగుస
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో మంగళవారం నాడు డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, అమర్నాథ్ రెడ్డి, జ్యోతుల నెహ్రూల మధ్య ఆసక్తిరమైన చర్చ జరిగింది. ఎవరికీ చెప్పకుండానే వైసిపి అధినేత జగన్ పీఏసీ చైర్మన్ పదవిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ పదవిని ఇస్తున్నట్లు జగన్ ఎవరికీ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. వీరు నలుగురు అసెంబ్లీ లాబీల్లో మాట్లాడుకున్నారు.
పీఏసీ చైర్మన్ పదవి జ్యోతుల నెహ్రూకు వస్తుందని భావించామని చినరాజప్ప, దూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
చినరాజప్ప మాట్లాడుతూ... నెహ్రూ తెలుగుదేశం పార్టీలో ఉండి ఉంటే ఆయననే ఉప ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పారు.
దానికి జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. పదవుల వద్దకు తాను వెళ్లనని, పదవులే తన వద్దకు వస్తాయని వ్యాఖ్యానించారు.
దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... తాను, జ్యోతుల నెహ్రూలం చాలా అనుభవజ్ఞులమని, కానీ పదవులకు మాత్రం సరిపోమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ... కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి వస్తుందని భావించామన్నారు. బుగ్గనకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు జగన్ ఎవరికీ చెప్పకపోవడం ఆశ్చర్యం వేసిందన్నారు. చిత్తూరు వాళ్లు తెలివైన వారనుకుంటారని, కానీ నష్టపోయేది వాళ్లే అన్నారు.

వైసిపిలో అసంతృప్తి
జగన్.. సీనియర్లను పక్కన పెట్టి బుగ్గనకు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వైసిపిలోను అసంతృప్తి కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. పార్ట చీఫ్ జగన్ వ్యవహారశైలి పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
భూమా నాగిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీఏసీ చైర్మన్ పదవిని ఆశించిన వారికి షాకిస్తూ... తొలిసారి డోన్ నుంచి ఎన్నికైన బుగ్గనకు అప్పగించారు. వాస్తవానికి 2014లోనే జ్యోతుల నెహ్రూ పీఏసీ చైర్మన్ పదవిని ఆశించారు. ఈసారి తనకు తప్పకుండా దక్కుతుందని భావించారు.
పైగా కాపు రిజర్వేషన్ల రగడ నేపథ్యంలో తనకు అవకాశం ఖాయమని జ్యోతుల భావించారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే భావించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అమర్నాథ్ రెడ్డి కూడా పీఏసీ చైర్మన్ పదవిని ఆశించారు. కానీ తనకు అత్యంత సన్నిహితుడైన బుగ్గనకు ఇచ్చి, సీనియర్లకు జగన్ చెక్ పెట్టారని అంటున్నారు.












Click it and Unblock the Notifications