జగన్ కేబినెట్ 2.0- కొత్త మంత్రులకు కొత్త సవాళ్లివే-ఎదుర్కొంటారా ! చేతులెత్తేస్తారా !
ఏపీలో పలు చర్చోపచర్చల తర్వాత ఇవాళ సీఎం జగన్ తన రెండో కేబినెట్ ను ఏర్పాటు చేశారు. తొలి కేబినెట్ లో మూడేళ్ల పాటు పనిచేసిన పలువురు మంత్రులు ఈసారి కూడా తమ స్ధానాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే పలువురు కొత్తమంత్రులు, కొత్త ముఖాలు ఈ కేబినెట్లో కనిపిస్తున్నాయి. అయితే వీరికి జగన్ కట్టబెట్టిన శాఖల్ని బట్టిచూస్తే వారు వచ్చే రెండేళ్లలో ఎదుర్కోవాల్సిన సవాళ్లు కళ్లముందు కనిపిస్తున్నాయి. వాటిని వారు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే 2024 ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఆధారపడనుంది. అవేంటో ఓసారి చూసేద్దాం...
కొత్త మంత్రులకు కొత్త సవాళ్లు
ఏపీలో ఇవాళ కొలువుదీరిన కొత్త మంత్రులకు వచ్చీ రాగానే కొత్త సవాళ్లు పలకరించబోతున్నాయి. ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో వారు చేయాల్సిన పనులతో పాటు ఎన్నికల కేబినెట్ కావడంతో ఎలాంటి ఆరోపణలు లేకుండా పనిచేయడం, ప్రజల్ని మెప్పించడం ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో ఎక్కడ తేడా వచ్చినా వారితో పాటు వైసీపీకి ఎన్నికల ముందు తలనొప్పులు తప్పవు. దీంతో జగన్ పలు సమీకరణాలతో ఎంపిక చేసిన వీరు వచ్చే రెండేళ్లలో ఏం చేయబోతున్నారనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఇందులోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయడంతో పాటు నవరత్నాల అమలు ప్రభుత్వానికి సవాల్ గా మారబోతోంది. ఈ సవాల్ ను మంత్రులు స్వీకరించి జగన్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడంలో విఫలమైతే మాత్రం 2024లో వైసీపీకి ఇబ్బందులు తప్పవు.
బుగ్గనకు ఆర్ధిక సవాళ్లు
జగన్ తొలి కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మరోసారి అదే శాఖ దక్కింది. దీంతో ఆయన ఎప్పటిలాగే అప్పుల కోసం, నిధుల కోసం, లోటు బడ్డెట్ పూర్తి కోసం తన ప్రయత్నాల్ని కొనసాగించాల్సి ఉంటుంది. అయితే గతంలోలా అప్పులుపుట్టే పరిస్ధితులు లేకపోవడం, వారాల తరబడి ఢిల్లీలో పాగావేసి మరీ కేంద్రం చుట్టూ తిరుగుతున్నా అరకొర విదిలింపులతో సరిపెడుతున్న పరిస్ధితుల్లో బుగ్గన ఈ రెండేళ్లలో తీసుకొచ్చే నిధులు వైసీపీ సంక్షేమ జాతరకు కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త పన్నుల విధింపుతో పాటు నిధుల కోసం వేట మరింత ముమ్మరం కావాల్సిందే. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా 2024 ఎన్నికల్లోవైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం.
అంబటికి పోలవరం సవాల్
రాజకీయాల్లో సీనియరే అయినా తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న అంబటి రాంబాబుపైనా జగన్ భారీ టార్గెట్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం కరవవుతున్న వేళ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఢిల్లీ లాబీయింగ్ తప్పనిసరి. జగన్, బుగ్గన ఎంత ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలకు వినతులు పెట్టినా క్షేత్రస్ధాయిలో అధికారులతో మాట్లాడి నిధులు ఇప్పించడం, వాటిలో సాంకేతిక అంశాల్ని కేంద్రం కొర్రీలు పెట్టకుండా చూసుకోవడం, ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అంబటి రాంబాబుకు కత్తి మీద సామే కానుంది. దీంతో పాటు రాష్ట్రంలో మిగతా జలవనరుల ప్రాజెక్టుల్ని, తెలంగాణలో జల వివాదాల్ని కూడా జలవనరుల మంత్రిగా రాంబాబే డీల్ చేయాల్సి వస్తుంది. ఇందులో గతంలోలా ఎక్కడైనా మాట తూలినా, పొరబాట్లు చేసినా భారీ మూల్యం తప్పదు.
హోంమంత్రిగా వనితకు సవాళ్లు
రాష్ట్రంలో ఇప్పటివరకూ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన తానేటి వనితకు ఇప్పుడు హోంమంత్రి రూపంలో భారీ బాధ్యతనే అప్పజెప్పారు జగన్. అయితే గతంలో సీఎంవో చెప్పినట్లే పనిచేసినా సుచరితకు కొనసాగింపూ దక్కలేదు. ఈ నేపథ్యంలో వనిత ఏం చేయబోతున్నారనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా దిశ చట్టం అమల్లోకి రాకపోవడం, మహిళలపై దురాగతాలు పెరుగుతుండటం, మహిళా హోంమంత్రుల కంటే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చురుగ్గా స్పందిస్తుండటం ఇప్పుడు తానేటి వనితకు సైతం సవాల్ కానుంది. ఎన్నికల ఏడాదిలో లా అండ్ ఆర్డర్ విషయాల్లో నిర్ణయాలు కూడా వనిత భవిష్యత్తును, వైసీపీ ప్రతిష్టను తేల్చబోతున్నాయి.
బొత్సకు విద్యాశాఖ, సురేష్ కు రాజధానుల సవాళ్లు
గతంలో పలు ముఖ్యమంత్రుల వద్ద వివిధ శాఖలు నిర్వహించిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఈసారి విద్యాశాఖను దక్కించుకున్నారు. ఇందులోనూ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక పథకాలు అమలు చేస్తుండటం, జాతీయ విద్యావిధానంతో పాటు విద్యావ్యవస్ధలో నిత్యం వస్తున్న మార్పుల్ని ఫాలో కావడం, ప్రవేశపరీక్షల్ని సమర్ధంగా నిర్వహించగలగడం బొత్సకు కత్తిమీద సామే కానుంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా వైసీపీ సర్కార్ ఈ ఐదేళ్లలో ఖర్చుపెట్టిన డబ్బు వృథా అవుతుంది. అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలకు అర్ధం లేకుండా పోతుంది. అలాగే మున్సిపల్ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్ కు అమరావతి వర్సెస్ మూడు రాజధానుల రూపంలో పెను సవాల్ తప్పకపోవచ్చు. విద్యాశాఖతో పోలిస్తే మున్సిపల్ శాఖ పూర్తిగా భిన్నమైనది. అలాగే సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యంగా అమరావతిని కాదని మూడు రాజధానుల్ని సమర్ధిస్తూ నిత్యం మీడియాతో పాటు అధికారవర్గాల్లోపాజిటివ్ వేవ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మూడు రాజధానులపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ రెండేళ్లలో మూడు రాజధానుల అంశం సురేష్ మెడకు చుట్టుకోనుంది.
వాస్తవంగా మిగిలింది ఏడాదే ?
ప్రస్తుతం కొలువుదీరిన మంత్రులకు మిగిలున్నది రెండేళ్లుగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల ఏడాదిని తీసేస్తే మిగిలేది ఏడాది మాత్రమే. ఈ ఏడాదిలో మంత్రులు తమకు అప్పగించిన శాఖలపై వేగంగా పట్టు సంపాదించడంతో పాటు సొంతగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతకేబినెట్ మంత్రులెవరూ తమ శాఖలపై పట్టు సాధించలేకపోయారు. సీఎంవో చెప్పినట్టే మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఏడాది కాలంలోనే పాలనపై వారు తమ ముద్ర వేసుకోవడంలో విఫలమైతే మాత్రం ఎన్నికల ఏడాదిలో వీరిపై ఒత్తిడి అమాంతం పెరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా తిరిగి గెలిచేందుకు వీలుగా రాజకీయ కార్యకలాపాలు సైతం ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడ విఫలమైనా మంత్రులుగా ఉండి ఓటమిపాలవ్వడం ఖాయం.