గంజాయిపై ఉక్కుపాదం- ఈడబ్ల్యూఎస్ కు ప్రత్యేక శాఖ : మంత్రులకు చురకలు.. కేబినెట్ లో సీఎం జగన్..!!
ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం పైన టీడీపీ..జనసేన నేతలు రాష్ట్రంలో గంజాయి సరఫరా పైన చేస్తున్న ఆరోపణల సమయంలో సీఎం వాస్తవ పరిస్థితులను మంత్రులకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం గంజాయిపైన ఉక్కుపాదం మోపిందని మంత్రులకు సీఎం వివరించారు. చంద్రబాబు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం తిప్పి కొట్టాలని మంత్రులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్దితో పని చేస్తోందని...ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టటంతో కొందరు వెనుకబడి ఉన్నారంటూ సీఎం చురకలు అంటించినట్లు సమాచారం.
గంజాయి విషయంలో కఠినంగా ఉన్నాం...
దీనికి కొనసాగింపుగా.. టీడీపీ హాయంలో రవాణా చేసినా గంజాయిని ఎక్కువగా పట్టుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం..టీడీపీ హాయంలో పట్టుకున్న లెక్కలు..ఈ రెండున్నారేళ్ల కాలంలో పట్టుబడిన లెక్కలను అధికారుల ద్వారా వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సాగు అయినా దాడుల చేసామని..దీని కోసం ప్రత్యేకంగా ఫోర్స్ ఏర్పాటు చేసామని సీఎం చెప్పారు. నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిద్దామని మంత్రులకు స్పష్టం చేసిన సీఎం... సంబంధిత నియోజకవర్గాల నేతలు - జిల్లా ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన స్పష్టం చేసారు.
బీసీ జనగణనపైన అసెంబ్లీలో తీర్మానం
బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. విశాఖ మధురవాడలో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ కు 130 ఎకరాల భూమిని కేటాయించటానికి కేబినెట్ ఆమోదించింది. అందులో 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం 130 ఎకరాల కేటాయించినట్లుగా వెల్లడించారు. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదించారు.
ఆర్దికంగా వెనుకబడిన వర్గాల ప్రత్యేక శాఖ ఏర్పాటు
ఈ డబ్ల్యూఎస్ కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం గా 4035 కొత్త ఉద్యోగాల కల్పనకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ నిర్ణయించింది. విశాఖ మధురవాడ లో శారదా పీఠానికి 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడ్రేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్ లకు ఆమోదించారు. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా సినిమా టిక్కెటింగ్ పద్దతి ప్రవేశ పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇక ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు
ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు తీర్మానం చేసారు. రాష్ట్రంలో గుట్కా నిషేధానికి కేబినెట్ నిర్ణయించింది. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం సూచించారు. 2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పధకం జూన్ మాసం లో అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పధకం వర్తించేలా ప్రచారం చేయాలని కేబినెట్ లో స్పష్టం చేసారు.