జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు:మంత్రి పరిటాల సునీత
గుంటూరు:వైసిపి అధినేత జగన్ పాదయాత్రకే పరిమితమవుతారని...ఆయన ఎప్పటికీ సీఎం కాలేడని మంత్రి పరిటాల సునీత జోస్యం చెప్పారు. గురువారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాయలసీమలో అభివృద్ధి జరిగిందా?... అని మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఎంతో మంది మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారని, తాము చంద్రన్న పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు సాయం చేస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని బిజెపి నేత కన్నా దుష్ర్పచారం ప్రారంభించారని ఆమె విమర్శించారు.
రాయలసీమలో ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన హంద్రీనీవాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని ఆమె నిలదీశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వమే హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇస్తోందని, దీనివల్ల రాయలసీమ మొత్తం పంటలతో కళకళలాడుతోందని మంత్రి పరిటాల సునీత చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదు:కన్నా లక్ష్మీనారాయణ
మరోవైపు ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్తోనే చంద్రబాబు జతకట్టారని, తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తుపై బాబు ఎపి ప్రజలకు సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.
అసలు చంద్రబాబు తీరు చూస్తుంటే విభజన సమయంలోనే కాంగ్రెస్తో ఆయన లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు అనిపిస్తోందని కన్నా అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి సైంధవుడని కన్నా అభివర్ణించారు. రాయలసీమకు టిడిపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. టిడిపి ప్రచారం చేసుకుంటున్న విధంగా రాయలసీమలో ఏ అభివృద్ధి జరగలేదని...రాయలసీమలో అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని కన్నా ఛాలెంజ్ చేశారు.
అంతకుముందు కన్నా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి విపరీతంగా చేశామని చెప్పుకోవడం టిడిపికి బాగా అలవాటైపోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఎద్దేవా చేశారు. అదే ఏం చేశారో చెప్పమంటే చెప్పరని, కానీ చాలా చేశామంటారని కన్నా దుయ్యబట్టారు. నిజానికి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని కన్నా చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఏ జిల్లానూ అభివృద్ధి చేయలేదని విమర్శించిన కన్నా...రాజధాని పేరుతో టిడిపి నేతలు వ్యాపారం చేస్తున్నారని పునరుద్ఘాటించారు.