జగన్ విధ్వంసానికి గుర్తు.. అమరావతిపై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు అమరావతిని సందర్శించారు. అమరావతి నిర్మాణాలను పరిశీలించారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం
అమరావతి రైతులు 1631 రోజులుగా ఆందోళన చేపట్టి రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని కోసం పోరాడిన ఘనత అమరావతి రైతులదని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శమని చంద్రబాబు తెలిపారు. అమరావతిని ప్రపంచమంతా గుర్తించిందని, ఏపీ అంటే అమరావతి, పోలవరం అంటూ ఉద్ధాటించారు.

ప్రస్తుత అమరావతి చూస్తే బాధేస్తోంది
చంద్రబాబు రాజధాని అమరావతిని వైసిపి ప్రభుత్వం అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలుపెట్టామని, కానీ గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని ఆయన అన్నారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అందరి ఆశీస్సులు, స్థల మహత్యం వల్లనే అమరావతిని కాపాడుకున్నామని చంద్రబాబు తెలిపారు.
భవనాలలో తుమ్మలు మొలిచాయి
అల్లరి మూకలు అమరావతి నమూనాను కూడా విధ్వంసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో అమరావతిలో కొనసాగిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. రోడ్లు నాశనం చేశారని, పైపులు దొంగిలించారని అసహనం వ్యక్తం చేశారు. టిడిపి ప్రభుత్వంలో చేసిన పని ఎక్కడిది అక్కడే నిలిచిపోయిందని, అప్పటినుంచి ఒక్క పని కూడా జరగలేదన్నారు. సెక్రటరీల బంగ్లాలో తుమ్మ చెట్లు మొలిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై చంద్రబాబు ప్రకటన
ఇక అమరావతిని ప్రజా రాజధానిగా పేర్కొన్న చంద్రబాబు, విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని, కర్నూలును మోడల్ సిటీగా మారుస్తామంటూ పేర్కొన్నారు. రాయలసీమతో సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు గుర్తు చేశారు.
మూడు రాజధానుల పేరుతో వైసిపి మూడు ముక్కలాట ఆడింది
రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అంటే రాష్ట్రం మధ్యలో ఉండాలని ఎనిమిదో తరగతి పిల్లాడిని అడిగినా చెబుతాడని, మూడు రాజధానుల పేరుతో వైసిపి మూడు ముక్కలాట ఆడింది అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని, అలాంటి అమరావతిని వైసిపి విధ్వంసం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో రౌడీయిజం లేకుండా చేస్తాం
ఇక రౌడీయిజం రాజకీయాల్లో లేకుండా చేస్తామని రౌడీయిజం చేసే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు చంద్రబాబు. ఋషులు తపస్సు చేసిన ఋషికొండ ప్రాంతాన్ని నాశనం చేశారని, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హీరోషిమా, నాగసాకి స్ఫూర్తిగా తీసుకొని ప్రజావేదికను జగన్ విధ్వంసానికి గుర్తుగా అలాగే ఉంచుతామన్నారు. గత సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారు. లేకుంటే ఊరుకున్నారు, కానీ ఎవరూ జగన్ లాగా చేయలేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications