కల్లుగీత కార్మికులకు భరోసాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికి ఏకంగా 10 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా కల్లుగీత కార్మికుల విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా తగిన చర్యలను తీసుకుంటున్నారు.
కల్లుగీత కార్మిక లోకం కోసం జగన్ మరో కీలక నిర్ణయం
ఏపీలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం నడుంబిగించిన ఏపీ ప్రభుత్వం కల్లు గీసే సమయంలో ఎవరైనా కార్మికులు ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే వారికి పరిహారం కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు శాశ్వత వైకల్యం బారిన పడిన కల్లు గీత కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్య అభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కూడా చూపించాలని నిర్ణయించింది. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడిన కల్లు గీత కార్మికులకు వైయస్సార్ బీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు అలాగే పరిహారం రూపంలో మరో ఐదు లక్షల రూపాయలను చెల్లించడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
శాశ్వత వైకల్యం బారిన పడిన వారికి 10 లక్షల పరిహారం
కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు కార్మికులు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వైయస్సార్ గీత కార్మిక భరోసా పథకం కింద పది లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. అయితే చనిపోయిన వారికి ఇచ్చే పరిహారాన్ని శాశ్వత వైకల్యం బారిన పడిన వారికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 2022 అక్టోబర్ 31న జారీ చేసిన కల్లుగీత విధానంలో, శాశ్వత వైకల్యం బారిన పడిన వారికి కూడా పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చే విధానాన్ని వర్తింప చేస్తూ సవరణలు చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.
ఏపీ కల్లు గీత పాలసీలో అనేక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో నూతన కల్లుగీత పాలసీని తీసుకువచ్చింది. 2022 నుండి 2027 వరకు ఈ పాలసీ అమల్లో ఉండనుంది. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం మద్య నియంత్రణ విధానానికి అనుగుణంగా ఈ విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విధానంలో కల్లు గీత లైసెన్సింగ్ విధానాన్ని పారదర్శకంగా జరిగేలా పాలసీని తీసుకువచ్చారు. అంతే కాదు కల్లు రెంటల్స్ సైతం ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అలాగే గీసే వాడికి చెట్టు పథకం వర్తింప చేస్తున్నారు.
కల్లుగీత కార్మికులకు భరోసా ఇస్తున్న జగన్ ప్రభుత్వం
కల్లుగీత కార్మిక సొసైటీలను ఏర్పాటు చేసి కల్లు గీత కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇక షెడ్యూల్డ్ ప్రాంతాలలో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం కూడా ఐదేళ్ల కు లైసెన్స్ ను ఇస్తున్నారు. తాటి, ఈత వంటి చెట్ల పెంపకానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే కల్లుగీత కార్మికులకు కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన సంక్షేమ పాలనను అందిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.