జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఆ మూడు నగరాల్లో సినీ స్టూడియోలు: 5 ఆటల టైమింగ్స్ పైనా..!!
సినీ పరిశ్రమను ఏపీలో విస్తరించే దిశగా జగన్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలతో సీఎం జగన్ సమావేశమైన సమయంలో తన ఆలోచనలను స్పష్టం చేసారు. తెలుగు సినిమాకు వచ్చే రెవిన్యూలో ఏపీ షేర్ ఎక్కువగా ఉందని.. ఏపీలోనూ పరిశ్రమ విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేసారు.
విశాఖ కేంద్రంగా సినీ స్టూడియోలకు భూములు కేటాయిస్తామని ఆ సమావేశంలోనే సీఎం ప్రతిపాదించారు. ఇదే సమయంలో విశాఖకు మాత్రమే పరిమితం కాకుండా... రాష్ట్రంలోని మూడు నగరాల్లో సినీ స్టూడియోల కోసం స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
మూడు నగరాల్లో స్టూడియోలు
ఇందు కోసం విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాలను ఎంపిక చేసారు. ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా.. మూడు నగరాల్లోనూ స్టూడియోల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ తాజా నిర్ణయం. ఇందు కోసం భూ సేకరణ పైన ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా భూనిధి ఏర్పాటు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
సినిమా షూటింగులు, సినిమా స్టూడియోల నిర్మాణం కోసం ఈ భూములను వినియోగించనున్నారు. తొలుత విశాఖలో పరిశ్రమ ఏర్పటు గురించి ప్రతిపాదనలు చేయగా.. ఇప్పుడు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమలో సినీ పరిశ్రమ కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఒక ప్రతిపాదన సిద్దం చేసింది.
ఆ సంస్థకు బాధ్యతల అప్పగింత
ప్రస్తుతం ఆన్ లైన్ టిక్కెట్ బాధ్యతలను చలనచిత్ర అభివృద్ధి సంస్థకు అప్పగించిన ప్రభుత్వం..ఈ భూముల బాధ్యతలను ఆ సంస్థ ద్వారానే నిర్వహించాలని భావిస్తోంది. ఇందు కోసం ఈ మూడు నగరాల నుంచి భూ సేకరణ పూర్తయిన తరువాత వాటిని సంస్థకు బదిలీ చేసి..అక్కడ నుంచి నిర్మాణం-నిర్వహణ-బదిలీ (బీఓటీ)విధానంలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయించింది.
మరోవైపు ప్రైవేటుగా స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, తాజాగా సీఎం - సినీ ఇండస్ట్రీ మధ్య జరిగిన సమావేశంలో టికెట్ ధరల పైన చర్చల్లో ఒక అంగీకారం జరిగింది. దీని మేర ప్రభుత్వం నియమించిన కమిటీ ధరల మీద నివేదిక ఈ నెల 17వ తేదీన అందించనుంది.
అయిదు షోల సమయాలు ఫైనల్
17వ తేదీన ఈ కమిటీ సమావేశమై తుది రూపు ఇవ్వనుంది. ఆ వెంటనే ప్రభుత్వానికి సిఫార్సులు ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది. దీని ఆధారంగా ఈ నెలాఖరులోగా టికెట్ ధరలు...అయిదో షో ప్రదర్శనకు వీలుగా సమయం ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయనుంది. అయిదు షోలకు సంబంధించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ అయిదు షోల ప్రదర్శన ఉండేలా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఉదయం 8 గంటలకు తొలి షో ప్రదర్శించి.. రాత్రి 8 గంటలకు చివరి షో ప్రారంభించాలనేది ప్రాధమిక ఆలోచన. వీటి పైన కమిటీ చేసే సిఫార్సులు సైతం పరిగణలోకి తీసుకొని...మరోసారి అభిప్రాయ సేకరణ తరువాత ఈ నెలాఖరు లోగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. దానికి అనుగుణంగా జీవోలు జారీ చేయనున్నారు. అయితే, ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలు..ఏపీలో 20 శాతం షూటింగ్ ...స్టూడియోల ఏర్పాటు పైన ఏపీ ప్రభుత్వం నుంచి కసరత్తు వేగవంతం చేస్తున్న సమయంలో..సినీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.