జగన్ సర్కార్ పై పెరిగిపోతున్న కేసులు-ప్రతీ శాఖకూ లీగల్ సెల్-మనుపాత్ర యాప్-కీలక నిర్ణయాలు
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధానాలతో పాటు వ్యవస్ధాగత లోపాలపై కోర్టు కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత ప్రభుత్వాల కేసులతో కలుపుకుని కోర్టు ధిక్కార కేసుల సంఖ్య అయితే ఏకంగా 8 వేలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో రోజువారీ పాలనపై ఈ ప్రభావం పడుతోంది. నిత్యం అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతుండటం తలనొప్పిగా మా్రుతోంది. అందుకే ప్రభుత్వం వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలైన కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం మనుపాత్ర పేరుతో కొత్త యాప్ తీసుకురావాలని నిర్ణయించింది.
వైసీపీ సర్కార్ పై కేసుల పర్వం
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విభాగాలపై కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో పిటిషనర్లు కూడా అంతే స్ధాయిలో కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. దీంతో అధికారులకు నిత్యం కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతోంది. ఇందులో ప్రభుత్వం తప్పిదాలు కొన్నయితే, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకున్న పలు నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్లు దాఖలు చేస్తున్న కేసులు కొన్ని ఉంటున్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోతున్నాయి.
కేసులపై సర్కార్ మరో సమీక్ష
ఏపీ ప్రభుత్వంపై కోర్టు కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి పరిష్కారానికి అధికారులు దృష్టిసారిస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు కోర్టు కేసులపై తాజాగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో కోర్టు కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం కూడదని, సమయానుసారంగా కేసుల పురోగతిపై స్పష్టత కలిగి ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ వివిధ విభాగాల అధిపతులను ఆదేశించారు. న్యాయస్ధానాలకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించాలని, కేసులకు సంబంధించిన వ్యవహారాలను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసారు.
ప్రతీ శాఖకూ లీగల్ సెల్-మనుపాత్ర యాప్
ఇవాళ పలు విభాగాల్లో కేసుల పరిష్కార పురోగతిపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన రజత్ భార్గవ... అయా విభాగాలు కేసుల సంఖ్యను అనుసరించి ప్రత్యేకంగా లీగల్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. క్రింది స్దాయిలో జరిగే తప్పుల వల్ల ప్రభుత్వానకి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. వివిధ విభాగాలకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులతో ప్రతి కార్యాలయం నుండి ఒకరు లైజనింగ్ నిర్వహించాలని, అటు ప్రభుత్వ శాఖలు ఇటు ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. మరోవైపు కోర్టు కేసులు త్వరితగతిన ముగించుకునేందుకు సహాయ పడేలా రూపొందించిన మనుపాత్ర యాప్ ను గురించి రజత్ భార్గవ సమావేశంలో వివరించారు. దీనిపై అయా శాఖల నుండి కొందరు అధికారులకు ప్రత్యేక శిక్షణను సైతం అందించారు.
జగన్ సర్కార్ పై కేసులు ఎన్నో తెలుసా ?
ఈ సందర్భంగా రజత్ భార్గత అయా విభాగాలకు సంబంధించి వివిధ స్దాయిలలో ఉన్న కేసుల సంఖ్య ఎంత అన్న దానిపై విచారించారు. రిజస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి దాదాపు 2000 పైచిలుకు కేసులు ఉండగా, పర్యాటక రంగం నుండి 50, క్రీడా విభాగానికి సంబంధించి 52, వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి 114 కేసులు వివిధ దశలలో ఉన్నట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో కేసులకు సంబంధించి విభజన చేసుకుని త్వరిత గతిన పరిష్కారం అయ్యే కేసుల విషయంలో శ్రద్ధ వహించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ కేసులు క్లియర్ కాకపోతే ఆయా విభాగాల్లో అధికారులపై తగు చర్యలు తీసుకునేందుకూ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.