జగన్ సర్కార్ సంచలన ఉత్తర్వులు: ఏడాది పాటు క్యాన్సర్ కారకాలైన ఆ ఉత్పత్తులు బ్యాన్!!
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే మందుబాబులకు షాక్ ఇవ్వడంతో పాటుగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పొగాకు, నికోటిన్ మరియు ఇతర నమిలే పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణాను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గుట్కా లేదా పాన్ మసాలా అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిషేధం విధించింది.
గుట్కా, పాన్ మసాలాలపై బ్యాన్ .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్, 2006లోని సెక్షన్ 30(2) (ఎ)లోని నిబంధనలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లేబొరేటరీస్ అండ్ ఫుడ్ (ఆరోగ్యం) ఫుడ్ సేఫ్టీ డైరెక్టరేట్ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 7 నుంచి అమలులోకి వచ్చే ఈ ఉత్తర్వులు ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్నాయి.
పొగాకు మరియు నికోటిన్లను పదార్థాలు కలిగి ఉండే గుట్కా,పాన్ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలను, చాప్ పొగాకు, స్వచ్ఛమైన పొగాకు, ఖైనీ, ఖర్రా, ఫ్లేవర్డ్ పొగాకు, వంటి పొగాకు ఉత్పత్తులను నమలడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఇతర రూపాల్లో పర్సులు, సాచెట్లు లేదా కంటైనర్లలో ప్యాక్ చేసిన ఫ్లేవర్డ్ పొగాకు, లేదా ఏ పేరుతోనైనా సరే హానికరమైన పొగాకు ఉత్పత్తులను ఏపీ ప్రభుత్వం సంవత్సరంపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తయారు చేయడం, సరఫరా చేయడం ,అమ్మడం, నిల్వ చేయడం నేరమని పేర్కొంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఏపీ ప్రభుత్వం. గుట్కా పాన్ మసాలా,జర్దాల వంటి హానికరమైన పదార్థాలను దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా నిషేధిస్తున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలోనూ నిషేధం .. కోర్టులు సైతం నిషేధానికి ఓకే
తెలంగాణ రాష్ట్రంలో గుట్కా పాన్ మసాలా పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక ఇటీవల రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలు కాగా వీటన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. కరోనా కంటే గుట్కా వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా గుట్కా పాన్ మసాలా పై నిషేధం విధించాయి.
ఏడాదిపాటు పశ్చిమ బెంగాల్ హర్యానా రాష్ట్రాలలో వాటిని బ్యాన్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ వీటి తయారీపై, అమ్మకాలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. తాజాగా జగన్ సర్కారు కూడా గుట్కా పాన్ మసాలా పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గుట్కా, పాన్ మసాలాల వల్ల హాని : ఐసీఎంఆర్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, 2006లో, ఏదైనా ఆహారం లేదా ఆహార పదార్ధాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ మరియు రవాణాను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 (FSS చట్టం)ని అమలులోకి తెచ్చింది. మానవ వినియోగం కోసం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే అందించాలన్నది ఈ యాక్ట్ ఉద్దేశం.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ చట్టం, 2006లోని సెక్షన్ 3 (1) ప్రకారం, పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులను కలిగి ఉన్న గుట్ఖా, పాన్ మసాలా ఆహార పదార్థాలు అని వివిధ సుప్రీంకోర్టు తీర్పులు పేర్కొన్నాయి. కానీ ఐ సి ఎం ఆర్ మరియు NIHFW యొక్క శాస్త్రీయ నివేదికలు గుట్కా నమలడం వల్ల కలిగే అత్యంత హానికరమైన ప్రభావాలను వివరించాయి.
Recommended Video
క్యాన్సర్ కారకాలుగా గుట్కా, పాన్ మసాలాలు .. అందుకే జగన్ సర్కార్ బ్యాన్ నిర్ణయం
అన్నవాహిక క్యాన్సర్, కడుపు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదలైన ప్రాణాంతక పరిస్థితులను గుట్కా, పాన్ మసాలాలు కలిగిస్తాయని పేర్కొన్నాయి. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్ కారకాలుగా గుట్కా, పాన్ మసాలాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 7 మంగళవారం నుండి గుట్కాలు, పాన్ మసాలాలు, జర్దా లపై ఏడాది పాటు బ్యాన్ కొనసాగనుంది.