జగన్ సర్కార్ కీలక ఆదేశాలు- ఇక శాఖల వారీగా ఆ భేటీలు- ఉద్యోగుల ఆగ్రహం ఫలితం
ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా 71 డిమాండ్లపై ఉద్యమిస్తున్నారు. తాజాగా ప్రభుత్వంతో పలుమార్లు చర్చల తర్వాత కాస్త శాంతించారు. ప్రభుత్వం పీఆర్సీపై త్వరలో తుది ప్రకటన చేస్తుందని ఆశాభావంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్ని శాంతింపచేసేందుకు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇందులో భాగంగా సీఎస్ సమీర్ శర్మ వివిధ శాఖలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వివిధ శాఖల వారీగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి వీలున్నంత వరకూ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్ల స్థాయిలో కూడా జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను ఆస్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పారు.
తాజాగా సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై తీసుకున్నచర్యల నివేదిక(ఎటిఆర్)ను సమీక్షించారు. అదే విధంగా వివిధ పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో వచ్చిన వివిధ ఆర్థిక,ఆర్థికేతర అంశాలను ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన,పరిష్కారించాల్సిన అంశాలపై సిఎస్ సమీక్షించారు.వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి వచ్చే ఏడాది నుండి డిపిసి(డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ)కేలండర్లను రూపొందించి సకాలంలో డిపిసిలు నిర్వహించి పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
వివిధ కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్ కార్యదర్శులను ఆదేశించారు. కోర్టు కోసులకు సంబంధించి జిపిలు ఇతర న్యాయాధికారులతో సమన్వయంతో పనిచేసేందుకు వీలుగా ప్రతిశాఖలో సంయుక్త కార్యదర్శి లేదా డిప్యూటీ కార్యదర్శి స్థాయిలో న్యాయ పరిజ్ణానం కలిగిన అధికారిని నోడలు అధికారిగా నియమించాలని సిఎస్ ఆదేశించారు.కోవిడ్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు వీలుగా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలతో సన్నద్ధమై ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.