జగన్ సర్కార్ ను వదలని అన్ రాక్-బాక్సైట్ సరఫరాకు రెడీ-కేంద్రం సహకరిస్తే భారీ ఊరట
ఏపీలోని విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో అప్పటికే లీజులు పొందిన అన్ రాక్ అల్యూమినియం సంస్ధతో వివాదం తలెత్తింది. ఇది కాస్తా అంతర్జాతీయ కోర్టుకు చేరింది. దీంతో ఇరుకునపడిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం సాయం కోరుతోంది. న్యాయపరిష్కారం ద్వారా ఈ వివాదం ముగిస్తే ఏపీకి ఓ భారీ పరిశ్రమ వస్తుందని అంచనా వేస్తోంది. ఇందుకు తమకు సహకరించాలని నిన్న రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అన్ రాక్ ఒప్పందం ఏపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకునపెడుతోందో ఓసారి చూద్దాం..

అన్ రాక్ ఒప్పందం ఇదీ
2007లో విశాఖ మన్యంలో 224 మెట్రిక్ టన్నుల బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా)తో ఏపీ ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరపడంతో పాటు ఆ తర్వాత దాన్ని శుద్ధిచేసి అల్యూమినియంగా మార్చేందుకు అన్రాక్ అల్యూమినియం పేరుతో ఓ జాయింట్ వెంచర్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ డీల్ను నిర్లక్ష్యం చేయడం, సీబీఐ కేసులతో ఇది అటకెక్కింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంతో పాటు ప్రస్తుత జగన్ సర్కారు సైతం బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో వైఎస్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసేశాయి. అయితే అర్ధాంతరంగా రద్దయిన రాకియా డీల్ ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ సర్కారు మెడకు చుట్టుకుంది.

అంతర్జాతీయ కోర్టుకు రాకియా
ఎప్పుడైతే 2016లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిందో అప్పుడే రాకియా దీనిపై న్యాయపోరాటం మొదలుపెట్టింది. ముందూ వెనుకా చూసుకోకుండా గిరిజనుల కోసం బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయడం వల్ల విశాఖలో అల్యూమినియం శుద్ధి కోసం 7 వేల కోట్లతో ఏర్పాటు చేసిన అన్రాక్ అల్యూమినియం కూడా పనికి రాకుండా పోయింది. చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్ సర్కారు సైతం బాక్సైట్ లీజులను పూర్తిగా రద్దు చేసేసిందో ఇక ఏపీ సర్కారుతో పాటు భారత ప్రభుత్వాన్ని కూడా రాకియా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు లాగింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకునపడ్డాయి. ఇప్పుడు దీనిపై ఏం చేయాలనే దానిపై ఇద్దరిపైనా ఒత్తిడి పెరుగుతోంది.

చిక్కుల్లో జగన్ సర్కార్
ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్ధతో భారీ ఒప్పందాలు చేసుకుని అర్ధాంతరంగా రాజకీయ ప్రయోజనాల కోణంలో వాటిని రద్దు చేసుకోవడంపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు వెళ్లిన రాకియా తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బాక్సైట్ సరఫరా చేయాలని లేదా తాము పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని పరిహారంతో పాటు వెనక్కి ఇవ్వాలని న్యాయపోరాటం చేస్తోంది. దీంతో భారత్ పరువు బజారున పడేలా ఉంది. అలాగని రాకియా డీల్ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించలేని పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో రాకియాతో సంప్రదింపులు జరిపి ఏదో ఒకటి తేల్చాలని ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదీ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ వేసి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. ఇందులో రాకియా కోరుతున్న విధంగా బాక్సైట్ సరఫరా చేసి బయటపడటం ఓ అంశం. లేకపోతే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్ధితి.

రాకియా వాటా కొనుగోలు యత్నాలు
రాకియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 224 మెట్రిక్ టన్నుల బాక్సైట్ సరఫరా చేయాలంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. దీంతో పక్కనే ఉన్న ఒడిశా నుంచి తీసుకోవాలని ప్రయత్నించినా అరకొరగా ఉన్న ఖనిజాన్ని వేలం పాటలో తీసుకోవాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఒక వేళ కేంద్రాన్ని బతిమాలి ఒడిశా నుంచి ఖనిజం తీసుకున్నా అది సరిపోదు. దీంతో రాకియా అన్రాక్ అల్యూమినియంలో పెట్టుబడిగా పెట్టిన 44.71 మిలియన్ డాలర్ల వాటాను ప్రభుత్వమే కొనుగోలు చేయక తప్పని పరిస్ధితి. కానీ అలా చేయాలన్నా ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. దీంతో వాటా కొనుగోలు ప్రయత్నాలు చేసే పరిస్దితీ లేదు. చివరికి ఏపీ సర్కార్ ఓ ఆలోచనకు వచ్చేసింది.

బాక్సైట్ సరఫరాకు అంగీకారం
అన్ రాక్ సంస్ధతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 224 మెట్రిక్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికీ తీసుకెళ్లింది. ప్రస్తుత పరిస్ధితుల్లో గతంలో రద్దు చేసిన బాక్సైట్ లీజుల్ని పునరుద్ధరించి అయినా ఈ వ్యవహారం నుంచి బయటపడాల్సిన పరిస్ధితి ఉండటంతో జగన్ సర్కార్ ఆ మేరకు బాక్సైట్ మైనింగ్ చేపట్టే అవకాశాలూ లేకపోలేదు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి బాక్సైట్ ఖనిజం కొనుగోలు చేసి అయినా అన్ రాక్ కు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయవచ్చని తెలుస్తోంది.

కేంద్రం సాయం కోరిన జగన్
అన్ రాక్ అల్యూమినియం సంస్ధతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బాక్సైట్ ఖనిజాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి నిన్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఈ విషయంలో అంతర్జాతీయ కోర్టులో ఆర్బిట్రేషన్ ద్వారా సమస్య పరిష్కారానికి సాయం చేయాలని కోరారు. దీంతో కేంద్రం ఈ వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ వ్యవహారం భారత దేశ ప్రతిష్టతో ముడిపడి ఉన్నందున జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు తాము మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు జగన్ సర్కార్ కోరుతున్న విధంగా బాక్సైట్ లీజుల్ని ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పించి అయినా అంతర్జాతీయ కోర్టులో ఈ వ్యవహారానికి ముగింపు పలకాల్సి ఉంది.
Recommended Video

కేంద్రం సై అంటే జగన్ కు భారీ ఊరట
రాకియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 224 మెట్రిక్ టన్నుల బాక్సైట్ సరఫరాకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో సొంత వనరుల ద్వారా కానీ లేదా ఇతర రాష్ట్రాలపై ఆధారపడి కానీ ఈ ఒప్పందం నెరవేర్చేందుకు కేంద్రం సహకరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనుకున్న విధంగా బాక్సైట్ సరఫరా చేస్తే విశాఖలో గతంలో చెప్పిన విధంగా అన్ రాక్ ప్లాంట్ ఏర్పాటవుతుంది. ఇది పనిచేయడం ప్రారంభిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు ఇతర సమస్యల నుంచి జగన్ సర్కార్ బయటపడటం ఖాయం. అందుకే ఇప్పుడు కేంద్రం సహకారంపై జగన్ సర్కార్ గంపెడాశలు పెట్టుకుంది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications