ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగించిన జగన్ సర్కార్ .. కరోనా కట్టడి నిర్ణయం ; ఎప్పటివరకంటే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనున్న కారణంగా ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.
పోస్ట్ కోవిడ్ బాధితులకు కొత్త సమస్య .. జుట్టు రాలుతున్న కేసులు, ఆస్పత్రులకు పరుగులు
రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగనున్న నేపథ్యంలో అనవసరంగా రాత్రి సమయాల్లో బయట తిరగొద్దు అని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని, మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది ఏపీ సర్కార్. కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సర్కార్, ఒక వేళ అలా ఎవరైనా తిరిగినట్లు కనిపిస్తే పది వేల రూపాయల నుండి 20 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని వెల్లడించింది.ఇక సంబంధిత సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే కరోనా నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు సంబంధించిన ఫోటోలను పంపితే తప్పనిసరిగా చర్య తీసుకుంటామని చెబుతున్న సర్కార్ దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇక నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Recommended Video
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు టీకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో పాఠశాలలను పునః ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మొత్తానికి ఏపీలో కరోనా కట్టడికి నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ మరోమారు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు పంపించారు.