వైయస్ఆర్ జయంతి నాడు జగనన్న స్వచ్చ సంకల్పం : గ్రామాల పరిశుభ్రతకు జగన్ సర్కార్ భారీ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక పథకాలను, రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జగన్ సర్కార్ దూసుకుపోతుంది . రాష్ట్రంలో ప్రతిపక్షాల నుండి ప్రతిరోజు పెద్దఎత్తున తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నా, వాటిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సరికొత్త వ్యూహాలతో, సరికొత్త కార్యక్రమాలతో ముందుకు వెళుతుంది.
గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు జగన్ సర్కార్ యోచన
గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా జగన్ సర్కారు భారీ కార్యక్రమానికి శ్రీకారం
ఇప్పటికే పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మిన జగన్ సర్కార్ గ్రామ సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి, గ్రామాలలోని ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు, వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చూస్తుంది. ఇక ఇదే సమయంలో తాజాగా రాష్ట్రంలోని గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా జగన్ సర్కారు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామాలలో అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించిన రాష్ట్రప్రభుత్వం ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల తరహాలో, గ్రామాలలో కూడా ఇళ్ళ నుండి చెత్త సేకరణతో పాటు, రోడ్లు ఊడ్చే పనుల నిర్వహణ ప్రతినిత్యం చేపట్టనుంది.
వైయస్ఆర్ జయంతి రోజైన జూలై 8 వ తేదీన "జగనన్న స్వచ్ఛ సంకల్పం"
వంద రోజుల పాటు మిషన్ మోడ్ గా దీనిని అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వైయస్ఆర్ జయంతి రోజైన జూలై 8 వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం ఏప్రిల్ 7 నుండి అన్ని గ్రామాలలో సన్నాహక కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్చ గ్రామాలుగా ఏపీలోని గ్రామాలు
వీధులలో చెత్తకుప్పలు లేని, చెత్తకుండీలే అవసరం లేని గ్రామాలుగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలను తీర్చిదిద్దనున్నారు. అంతేకాదు ఇళ్ల మధ్య నీటి గుంతలకు తావులేకుండా, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా , కుటుంబ ఆరోగ్య విషయంలో అవగాహన పెంచేలా రకరకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు . స్థానిక ప్రజలకు ఊరు పరిశుభ్రత బాధ్యతను అప్పగించనున్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏదీ సాధ్యం కాదని భావిస్తున్న నేపథ్యంలోనే ప్రజలను సైతం భాగస్వాములుగా చేయడానికి పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఏప్రిల్ 7 నుండి సన్నాహక కార్యక్రమాలు .. వందరోజుల కార్యక్రమంగా జగనన్న స్వచ్చ సంకల్పం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అయిన ఏప్రిల్ 7 నుండి సన్నాహక కార్యక్రమాలను మొదలుపెట్టి, ప్రజల భాగస్వామ్యంతో కొనసాగించనున్నారు. జూలై 8 వ తేదీ నుండి జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో గ్రామాలలో పలు పరిశుభ్రత కార్యక్రమాలను పంచాయతీ అధికారులు అమలు చేసి చూపిస్తారు. ఈ వంద రోజులు కార్యక్రమానికి అయ్యే ఖర్చును పంచాయతీరాజ్ శాఖ నిధుల నుంచి ఖర్చు చేస్తారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి జగన్ సర్కార్ తీసుకున్న ఈ కార్యాచరణ ప్రణాళిక ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో, గ్రామాలలో గ్రామస్థుల భాగస్వామ్యం ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.