భ్రూణ హత్యలకు చెక్ పెట్టేలా జగన్ సర్కార్ సంచలనం; ఆ సమాచారం ఇస్తే భారీగా నగదు పురస్కారం
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వారు ఎందరో ఉన్నారు. అక్రమ అబార్షన్లు నిర్వహిస్తూ వైద్యులు అడ్డంగా దొరికిన అనేక ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చెయ్యకూడదు అని చెప్పినా, భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరం అని చెప్పినా సరే కాసుల కక్కుర్తిలో కొందరు వైద్యులు భ్రూణ హత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎంతగా బెదిరించినా, స్కానింగ్ సెంటర్ల పై కేసులు నమోదు చేసిన కూడా భ్రూణ హత్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భ్రూణ హత్యలను చేయడం చట్ట వ్యతిరేకమని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో భ్రూణ హత్యల నివారణకు దిశగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
భ్రూణ హత్యల నివారణ దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్
ఆడపిల్ల అంటే చాలు బిడ్డ పుట్టక ముందే కడుపులోనే చిదిమేస్తున్నవారు ఎందరో ఉన్నారు. మగపిల్లవాణ్ణి కనడం కోసం స్కానింగ్ సెంటర్ కు వెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆ పరీక్షలలో ఆడపిల్ల అని తెలిస్తే గుట్టుచప్పుడు కాకుండా గర్భస్థ శిశువును చిద్రం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇక ఇలాంటి వారికి చెక్ పెట్టడం కోసం పెద్ద ఎత్తున స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు చేసినా, కేసులు పెట్టినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు జరగడం చోటు చేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సర్కార్ భ్రూణ హత్యల నివారణ దిశగా అడుగులు వేస్తోంది.

సమాచారం ఇస్తే 25 వేల రూపాయల నగదు బహుమతి
లింగ నిర్ధారణ పరీక్షలను నివారిస్తూ 1994 లో తీసుకొచ్చిన చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో చట్టవ్యతిరేకంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాల సమాచారాన్ని అందించిన వారికి భారీ నగదు పురస్కారాన్ని ఇస్తామంటూ ప్రకటించింది. ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై ప్రజలు ఇచ్చిన సమాచారంతో కేసులు నమోదైతే వారికి 25 వేల రూపాయల నగదు బహుమతి ఇస్తామని వెల్లడించారు.
నిందితులకు శిక్ష పడితే లక్ష బహుమతి
అలాగే నిందితులకు కోర్టులో శిక్ష ఖరారు అయితే సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల పురస్కారం అందజేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని, పౌరులు 104 నెంబర్ కు కానీ, సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి కానీ ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని కాటంనేని భాస్కర్ సూచించారు. అంతేకాకుండా pcpndt.ap.gov.in వెబ్ సైట్ ద్వారా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
ఇకపై స్కానింగ్ సెంటర్ లపై ప్రజలతోనే నిఘా వ్యవస్థ
సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, భ్రూణ హత్యలు నివారించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణహత్యలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్లపై ప్రజలనే ఒక నిఘా వ్యవస్థలా తయారుచేసి, ఒకవేళ సమాచారం ఇస్తే వారికి తగిన విధంగా భారీ పారితోషికం ఇస్తామని ప్రకటించి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications