ఇంకా డిప్రెషన్లో, కథ నడిపిందే మీరు: జగన్పై పత్తిపాటి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం నిప్పులు చెరిగారు. జగన్ ఓటమి డిప్రెషన్ నుండి ఇంకా బయటకు వచ్చినట్లుగా కనిపించడం లేదన్నారు. ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
జగన్ మాటల్లో అవగాహనారాహిత్యం, అజ్ఞానం కనిపిస్తోందన్నారు. ఓటమి ఒత్తిడి నుండి ఆయన ఇంకా బయట పడినట్లుగా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర పరిస్థితులు జగన్కు తెలుసునని, అలాగే విడిపోయిన తర్వాత బడ్జెట్ ఎంతో తెలుసునని చెప్పారు. అన్నీ తెలిసిన జగన్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
రాత్రికి రాత్రే సూటుకేసు కంపెనీలు, మనీలాండరింగులు చేసినట్లు కాదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయడం ఇష్టం లేని జగన్ రైతు వ్యతిరేకి అన్నారు. ఆయన తండ్రి వైయస్ కూడా రైతు వ్యతిరేకి అన్నారు. రుణమాఫీ చేయనని జగన్ ముందే చెప్పారని, ఆయన అసాధ్యమన్న దానిని తాము చేసి చూపామన్నారు.
జగన్ పార్టీకి ప్రజలు ఎప్పుడో నరకాసుర వధ చేశారని, ఇప్పుడు చంద్రబాబుకు నరకాసుర వధ చేయడం కాదన్నారు. రాష్ట్ర విభజనకు అసలు కారకులు జగనే అన్నారు. ఆయన తండ్రి నుండి జగన్ వరకు విభజనకు కథ నడిపారన్నారు. కేసీఆర్తో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
విభజనకు కథ నడిపింది అంతా జగనే అన్నారు. అటువంటి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగాలా అన్నారు. ఎర్రచందనం, ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను సెక్యులరైజేషన్ చేస్తామని చెప్పాం కానీ అటవీ భూములను తాకట్టు పెడతామని చెప్పలేదన్నారు. జగన్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
వనరులను క్రియేట్ చేసుకోవద్దంటారని, మరోవైపు రుణాలు మాఫీ చేయమంటారని విమర్శించారు. రాష్ట్రం పరిస్థితి ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సంపాదించిన జగన్ రుణమాఫీ ఎలా చేయాలో చెబితే బాగుంటుందన్నారు. చంద్రబాబు రైతు పక్షపాతిగా చరిత్రలో మిగిలిపోతున్నారని, ఇది జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు.