కేసీఆర్ బాటలో జగన్: తెలంగాణలో ఇప్పటికే ఆ స్కీమ్..ఏపీలో అక్టోబర్ 10న ప్రారంభం
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకాన్ని ఏపీ లో కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్న జగన్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు సైతం నడుంబిగించారు. ఇక రాష్ట్ర ప్రజలందరికి కంటి వెలుగు పథకం ద్వారా ఉచిత నేత్ర చికిత్స అందించనున్నారు.
అక్టోబరు 10వ తేదీ నుంచి వైఎస్ఆర్ 'కంటి వెలుగు' పథకం
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 10వ తేదీ నుంచి 'కంటి వెలుగు' పథకం ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటి వెలుగు పథకం కింద రూ.560 కోట్లతో కంటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు .మంత్రి క్యాంపు కార్యాలయంలో నేత్రవైద్య నిపుణులు పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన నేపథ్యంలో నాని ఈ విషయాన్ని పేర్కొన్నారు. మంత్రి నాని రాష్ట్రంలో 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు, ఆధునిక వైద్యం అందించడానికి వైసిపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని చేపట్టిందన్నారు.
కంటి వెలుగు పథకం సక్సెస్ చెయ్యాలని నేత్ర వైద్యులను కోరిన మంత్రి ఆళ్ళ నానీ
ఇక నేత్ర వైద్యులందరూ ఈ పథకం సక్సెస్ కావడానికి సహకరించాలని డిప్యూటీ సీఎం నాని కోరారు.మంత్రిని కలిసిన నేత్రవైద్యులు సైతం కంటి వెలుగు పథకానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అక్టోబరు 10న 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి నాని తెలిపారు. సీఎం జగన్ నవరత్నాలు అమలులో భాగంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూడా పెద్ద పీట వేస్తున్నారని మంత్రి ఆళ్ళ నానీ తెలిపారు.
తెలంగాణా సర్కార్ గతేడాది ప్రారంభించిన పథకం కంటివెలుగు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కంటి వెలుగు పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందిస్తుంది .ఈ పథకాన్ని మెదక్ జిల్లా మల్కాపూర్ లో 2018 ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించారు కెసిఆర్.
ఏపీలో కంటివెలుగు కోసం ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి సర్కార్ మాత్రం అక్టోబరు 10 నుంచి ఈ పథకం ప్రారంభించనుంది. అక్టోబర్ 10 నుండి 16వ తేదీ వరకు కంటి పరీక్షలు జరుగుతాయని, తర్వాత ఆరు దశల్లో కంటిచూపు లోపం గుర్తించిన వారందరికీ ఆధునిక వైద్యపరీక్షలు, అవసరమైన శస్త్ర చికిత్సలు, మందులు, కళ్ళజోళ్ళు ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. అక్టోబరు 10వ తేదీ నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కంటి వెలుగు స్కీమ్ తో కేసీఆర్ బాటలో జగన్
తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కంటి వెలుగు పథకం పేరుతో పేదలకు ఉచితంగా కళ్ల పరీక్షలు నిర్వహిస్తోన్న నేపధ్యంలో ఇప్పుడు ఈ లిస్టు లో ఏపీ కూడా చేరుతోంది. ఇప్పటికే చాలా విషయాల్లో కేసీఆర్ ను అనుసరిస్తున్న ఏపీ సీఎం జగన్ ఈ నిర్ణయంతో తెలంగాణా సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారన్న భావన వ్యక్తం అవుతుంది.