ఏంచేద్దాం?: టిలో 50స్థానాలపై జగన్ కన్ను, సీట్లపై ఆరా
హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్నికల ప్రచారాన్ని ఓసారి ముగించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలెట్టారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న జగన్ శనివారం ఉదయం 11 గంటల నుంచి స్క్రీనింగ్ కమిటీతో సమావేశమయ్యారు.
తెలంగాణలో టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల విషయమై వైవి సుబ్బారెడ్డి తదితరులు జగన్కు తెలిపారు. టిక్కెట్లు ఆశిస్తున్న వారిపై అన్ని కోణాల్లోను ఆలోచనలు చేస్తోంది. విజయావకాశాలు, ఖర్చు, ఎక్కడెక్కడ గెలుస్తాం, ప్రజాబలం, కుల సమీకరణ ఇవన్నింటిని జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారంటున్నారు.
ఆదివారం మరోసారి సమావేశమై ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసుకొని వారిని పిలిపించి మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చారు. వారితో మాట్లాడిన తర్వాత సోమవారం జాబితా ఫైనల్ చేసి 8న ప్రకటించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, తెలంగాణ ప్రాంతంలో జగన్ ప్రధానంగా నలభై , యాభై సీట్ల పైన దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ ఏఏ నియోజకవర్గాల్లో పట్టు ఉంది, ఎక్కడ పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయనే అంశాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ దాదాపు యాభై స్థానాలలో పోటీ చేయవచ్చునంటున్నారు.