రాష్ట్రాన్ని దోచుకొనేందుకు జగన్ ఆకలితో ఉన్నాడు: మంత్రి లోకేష్
రాష్ట్రాన్ని దోచుకొనేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకలితో ఉన్నాడని ఏపీ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఆరోపించారు
కడప: రాష్ట్రాన్ని దోచుకొనేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకలితో ఉన్నాడని ఏపీ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఆరోపించారు.
బుదవారంనాడు ఆయన కడప జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే ఆయన అధికారాన్ని కావాలనే కాంక్షతో ఉన్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ కూడ విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నియోజకవర్గాల పట్ల వివక్షను చూపలేదన్నారు.
వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి కూడ కృష్ణా నీటిని సరఫరాచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కడప జిల్లాను ఎలక్ట్రానిక్ క్లస్టర్గా తీర్చిదిద్దనున్నట్టు లోకేష్ హమీ ఇచ్చారు.
అంతకుముందు ఆయన కడపజిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.