సీఎం పదవికి జగన్ అనర్హుడు...మోదీకి, జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు:మంత్రి కళా వెంకట్రావు
శ్రీకాకుళం: 16 నెలలు జైలులో ఉన్న జగన్ కు ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే అర్హత లేదని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి కిమిడి కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా నిద్దాం గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
జైలు జీవితం గడిపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అసలు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని కళా వెంకట్రావు అన్నారు. జగన్ వైసీపీని తన స్వలాభం కోసం స్థాపించాడని...ప్రజల కోసం కాదని విమర్శించారు. అందుకే రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం ఆయనకు ఏమాత్రం పట్టదని కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్ కు అధికారదాహమే తప్ప ప్రజాసంక్షేమం అవసరం లేదని అన్నారు. అలాగే టీడీపీకి మోడీ వెనుక ఉండి గోతులు తవ్వారన్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కళా వెంకట్రావు దుయ్యబట్టారు. రానున్న రోజులలో మోదీకి, జగన్కు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరు చేసి వారి కళ్లల్లో కాంతులు నింపారని మంత్రి కళా వెంకట్రావు సిఎం చంద్రబాబు సేవలను ప్రస్తుతించారు.
2 కోట్ల 30లక్షల మంది మహిళలకు రూ.13వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు రూ.1200 కోట్ల నిరుద్యోగ భృతి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. 25వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రహదారులు నిర్మించామని వెల్లడించారు. అడిగిన వారందరికీ వరాలు ఇచ్చే వ్యక్తి చంద్రబాబు అన్నారు.
మడ్డువలస, తోటపల్లి జలాశయాల ద్వారా సాగునీరు అందించి రైతులలో ఆనందం నింపారన్నారు. నిద్దాం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కళా వెంకట్రావుతో పాటు టిడిపి నేతలు పైల బాబ్జినాయుడు, ఎంఎంఎస్ అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, పైల రామకృష్ణంనాయుడు, కుమరాపు రవికుమార్, విక్రం కాశిబాబు తదిదరులు పాల్గొన్నారు.