పాదయాత్ర ముగింపు ఆ రోజే : హోదా పై సంచలన నిర్ణయం దిశగా : జగన్ సరి కొత్త వ్యూహం..!
Recommended Video
వైసిపి అధినేత జగన్ నిర్వహిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. ముగింపు ను ఘనంగా నిర్వహించేం దుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 14 నెలలుగా సాగుతున్న యాత్ర జనవరి 8న ఇచ్ఛాపురం లో ముగియనుంది. ఆ తరువాత జగన్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యేక హోదా తో పాటుగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచు కొని కొత్త సంవత్సరంలో కదన రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు.
ముగింపు నాడు కార్యాచరణ ప్రకటన..
వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ముగింపు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది నవంబర్ 6న ఇడుపుల పాయలో ప్రారంభ మైన జగన్ ప్రజా సంకల్ప యాత్ర జనవరి 8న ఇచ్చాపురం లో ముగియనుంది. ఆ రోజు ఇచ్ఛాపురం లో భారీ బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్ర ముగింపుకు గుర్తుగా ఓ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ఆ సభ ద్వారా జగన్ తన రాజకీయ భవిష్యత్ ను ప్రకటించే అవకాశం ఉంది. పాదయాత్ర ముగిసినా..ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో..ఆ వెంటనే అమలు చేయాల్సిన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సంక్రాంతి అయిన వెంటనే బస్ యాత్ర ద్వారా పాదయాత్రలో వెళ్లలేకపోయిన నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు.
పాదయాత్ర సమయంలోనే
ఇందు కోసం రూట్ మ్యాప్ సిద్దం అవుతోంది. ఇదే సమయంలో..అభ్యర్ధుల ఎంపిక పైనా జగన్ ఓ అంచనా కు వచ్చినట్లు తెలుస్తోంది. పాదయాత్ర సమయంలోనే..జిల్లాల్లో తనకు ఎదురైన అనుభవాలు..అభ్యర్ధుల పనితీరు..ప్రజల అంచనాలు వంటి వాటి పై జగన్ పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, నియోజకవర్గాల వారీగానూ సర్వేలు చేయించారు. ఇప్పుడు వీటి ఆధారంగానే..సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసుకుంటూ అభ్యర్ధుల పై నిర్ణయం తీసుకోనున్నారు..
ప్రత్యేక హోదా పై రంగంలోకి...
జగన్ పాదయాత్ర ప్రారంభం అయిన నాటి నుండి ఏపికి ప్రత్యేక హోదా పై వైసిపి చెప్పుకొనే స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించలేదు. వైసిపి ఎంపీలు ఇదే అంశం పై రాజీనామా చేసినా..ఆశించిన స్థాయిలో పొలిటికల్ మైలేజ్ రాలేదు. ఇదే సమయంలో ప్రతీ రోజు టిడిపి నేతలు హోదా డిమాండ్ తో కేంద్రం పై విమర్శలు చేస్తున్నారు. జగన్ ను సైతం కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో.. జగన్ ప్రత్యేక హోదా పై పాదయాత్ర ముగిసిన వెంట నే కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా.. ఢిల్లీలో హోదా డిమాండ్ చేస్తూ దీక్షకు దిగాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ కేంద్రంగా 27న పార్టీ నేతలు వంచన పై గర్జన నిర్వహిస్తున్నారు. కానీ, స్వయంగా జగన్ ఢిల్లీ లో దీక్ష చేయటం ద్వారా అందరి దృష్టి కేంద్రీకృతం అవుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఒక, జనవరి లోనే టిడిపి అభ్యర్ధులను ఖరారు చేస్తామని చెబుతోంది. జగన్ తన పాదయాత్ర లో ఇప్పటికే కొంత మంది అభ్యర్ధులను ఖరారు చేసారు. జనవరి మాసాంతానికి అభ్యర్ధులను ఖరారు చేసి..నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.