జగన్, పవన్లకు మోడీపై మాట్లాడే దమ్ము లేదు...చేతనైతే కేంద్రంపై పోరాడండి:మంత్రి లోకేష్
గుంటూరు:ప్రత్యేకహోదా విషయంలో ప్రతిపక్ష నాయకులు జగన్, పవన్ కళ్యాణ్ లకు ప్రధాని మోడీపై నోరు మెదిపే దమ్ములేదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ దుయ్యబట్టారు.
మంగళవారం మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా దుర్గి మండలం ముటుకూరులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.సమస్యలతో సతమతమవుతున్న మాచర్ల నియోజకవర్గాన్ని ఎన్నికల వరకు తాను దత్తత తీసుకుంటానని రాష్ట్ర ఐటి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్, పవన్ కళ్యాణ్ చేతనైతే కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని హితవు పలికారు.
గుంటూరు జిల్లాలో...లోకేష్ పర్యటన
నియోజకవర్గ పర్యటనలో భాగంగా దుర్గి, మాచర్లకు మంగళవారం వచ్చిన ఆయన ముందుగా దుర్గి మండలం ముటుకూరులో గ్రామదర్శినిలో పాల్గొన్నారు. సాధికార మిత్రలతో మాట్లాడి పలు అంశాలపై వివరాలు అడిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రస్తావించారు. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని, వరికపూడిసెల ఎత్తిపోతల అంశాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని చెప్పారు. మాచర్ల ఎంఎల్ఎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక సమస్యలపై ఎప్పుడూ తన వద్దకు రాలేదని, అలాంటి వ్యక్తిని ఎలా గెలిపించారని నిలదీశారు.
Recommended Video
రాష్ట్రంలో...పరిశ్రమలు...ఉపాధి
రాష్ట్రంలో 720 పెద్ద పరిశ్రమలను తెచ్చి 2,20,000 మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని...యువత నైపుణ్యం పెంచుకోవాలని మంత్రి లోకేష్ చెప్పారు. త్వరలో యువనేస్తం ద్వారా నిరుద్యోగులకు నెలకు రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుపై జగన్ నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని తుపాకీతో కాల్చాలని, కాలర్ పట్టుకోవాలని అనడాన్ని ప్రస్తావించారు. అప్పులతో విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారా అని మండిపడ్డారు.
బిజెపికి...సినిమా చూపిస్తాం
కులం, మతం, ప్రాంతాల పేరుతో రాష్ట్రంలో చిచ్చుపెడుతున్నారని బిజెపి, వైసిపి, జనసేనను ఉద్దేశించి మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల్లో భాజపాను ఓడించాలని చంద్రబాబు చెప్పారని...కానీ వైకాపా మాత్రం తన పత్రికద్వారా, నేతల ద్వారా భాజపాకు మద్దతు ఇచ్చిందని మంత్రి లోకేష్ విమర్శించారు. బిజెపికి రానున్న ఎన్నికల్లో సినిమా చూపిస్తామని లోకేష్ ఎద్దేవా చేశారు.
పోరాడుతోంది...టిడిపి మాత్రమే
ప్రతి పేదకుటుంబానికి మేలుచేసే లక్ష్యంతో చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి అనేక పథకాలకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఎపికి ప్రత్యేకహోదా కోసం పోరాడుతుంది తెదేపా మాత్రమేనన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపాకు తెలుగువారి సత్తా చూపాలన్నారు. ముటుకూరు గ్రామాభివృద్ధిపై రూపొందించిన పుస్తకాలను ఆయన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావులతో కలిసి ఆవిష్కరించారు.