జగన్ సర్కార్ మరో యూటర్న్ ? మళ్లీ ప్రైవేటుకు మద్యం షాపులు-తత్వం బోధపడిందా!
ఏపిలో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఉపయోగపడిన హామీల్లో మద్యనిషేధం కూడా ఒకటి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ హంగామా మొదలుపెట్టిన వైసీపీ సర్కార్.. 20 శాతం షాపుల్ని తొలగించింది. రెండో ఏడాది కూడా తొలగిస్తామని చెప్పినా కరోనా రావడంతో దాన్ని పక్కనబెట్టింది. అప్పటి నుంచి మద్యం ఆదాయంపై ఆధారపడుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం చేతుల్లో ఉన్న మద్యం షాపుల్ని ప్రైవేటు వ్యక్తులకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మద్యంషాపులపై జగన్ యూటర్న్?
ఏపీలో మద్యనిషేధం అమలు చేసే క్రమంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుంది. ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడమేంటని అంతా విమర్శించినా పట్టించుకోలేదు. అంతే కాదు తీసుకున్న షాపుల్లో 20 శాతం మూసేసింది. మిగతా షాపుల్లోనూ నగదు రహితంగా చేయాల్సిన వ్యాపారాన్ని నగదుతోనే చేస్తోంది. మద్యం షాపుల్లో రెగ్యులర్ బ్రాండ్లు తీసేసి నాసిరకం మద్యం బ్రాండ్లను తెచ్చి అమ్ముతోంది. అయినా దీనిపై వచ్చే ఆదాయాన్ని అప్పులు తెచ్చుకునేందుకు హామీగా వాడుకుంటోంది. ఇంత చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరోసారి దీనిపై యూటర్న్ తీసుకునేందుకు సిద్ధమైపోయింది.
మళ్లీ ప్రైవేటు చేతుల్లోకి!
ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకున్న మద్యం షాపుల్ని తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే మంచిదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే తీసుకున్న మద్యం షాపుల్ని తిరిగి వేలం నిర్వహించి ప్రైవేటు వ్యక్తులకు, సంస్ధలకు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలో విధాన నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆదాయంపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈ దిశగా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారంగా మద్యం వ్యాపారం?
ప్రభుత్వం మూడేళ్లుగా నిర్వహిస్తున్న మద్యం వ్యాపారం భారంగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం పెట్టిన రేట్లకు నాసిరకం మద్యాన్ని కొనేందుకు తాగుబోతులు ఇష్టపడటం లేదు. అదే సమయంలో రెగ్యులర్ బ్రాండ్లు మళ్లీ తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో ఆదాయం కూడా పెరగడం లేదు. గతేడాది రూ.25 వేల మద్యం అమ్మితే.. ప్రభుత్వానికి రూ.20 వేల కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాపారం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేటుకు ఇచ్చేస్తే దీనికి రెట్టింపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రైవేటుపరంతో డబుల్ ధమాకా?
ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ.1900 కోట్ల రూపాయల మద్యాన్ని తమ దుకాణాల్లో అమ్ముతోంది. అదే ప్రైవేటుకు ఇస్తే రూ.3 వేల కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రభుత్వానికి ఉన్న పరిమితులు ప్రైవేటుకు లేకపోవడమే ఇందుకు కారణం. వేలం ద్వారా మద్యం షాపులు కొనుక్కున్న వారు ప్రభుత్వంలా రూల్స్ పాటిస్తూ వ్యాపారం చేయరు. ధనార్జనే లక్ష్యంగా వ్యాపారాలు చేస్తారు. దీంతో వారితో పాటు ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. మరోవైపు ఇప్పటికిప్పుడు మద్యం వ్యాపారానికి వేలం నిర్వహిస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, లైసెన్స్, అప్లికేషన్ ఫీజుల రూపంలో కనీసం రూ.1000కోట్లు ప్రభుత్వ ఖాతాలో పడతాయి. దీంతో ప్రభుత్వం దీనిపై ముందడుగు వేస్తోంది.
జగన్ కు తత్వం బోధపడిందా?
గతంలో దశాబ్దాల క్రితమే ప్రభుత్వాలు మద్యాన్ని పూర్తిస్దాయిలో ఆదాయ వనరుగా మార్చేసుకున్నాయి. ఇప్పటికీ చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం ఆదాయం మీదే నడుస్తున్నాయి. మద్యం నిషేధం పేరుతో జనాన్ని కొంతకాలం నమ్మించినామ అంతిమంగా మాత్రం ఆదాయార్జనే లక్ష్యంగా దానికి తూట్లు పొడవాల్సిన పరిస్ధితి. అయితే జగన్ మాత్రం మద్య నిషేధం హామీతో రాష్ట్రంలో కుటుంబాల కష్టాలన్నీ తీరిపోతాయని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ రంగంలోకి దిగిన తర్వాత మాత్రం పరిస్ధితి అర్ధమైంది. దీంతో మద్య నిషేధం హామీ ఇప్పటికే అటకెక్కేసింది. ఇప్పుడు ప్రైవేటుకు మద్యం దుకాణాలు ఇచ్చేస్తే ఇక పూర్తిగా మద్య నిషేధం మాటమైనట్లే. అదే సమయంలో ప్రభుత్వానికి భారీ స్ధాయిలో ఆదాయం సమకూరుతుంది. అలాగే మద్యం షాపుల నిర్వహణ భారం తగ్గిపోతుంది.