కొత్త గవర్నర్ పై జగన్ సర్కార్ కోటి ఆశలు ? కీలక సమయంలో ఎంట్రీ ! హింట్ ఇచ్చేసిన నజీర్ ?
ఏపీలో గవర్నర్ల మార్పుతో కేంద్రం ఇచ్చిన సంకేతమేంటో త్వరలో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వకముందే కొత్త గవర్నర్ ఎంచుకున్న ప్రాధాన్యతలకే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఏపీలో పాత గవర్నర్ హరిచందన్ బదిలీపై ఛత్తీస్ ఘడ్ వెళ్లిపోయారు, కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు ప్రతీ రాష్ట్రంలోనూ ఇది సహజంగా జరిగే ప్రక్రియే. అయితే గవర్నర్ మార్పుకు కేంద్రం ఎంచుకున్న సమయం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు కొత్త గవర్నర్ రాకకు ఎనలేని ప్రాధాన్యం తెచ్చిపెట్టాయి. అలాగే కొత్త గవర్నర్ పై వైసీపీ సర్కార్ కూడా కోటి ఆశలతో ఎదురుచూస్తోంది.

ఏపీ కొత్త గవర్నర్ నజీర్
ఏపీలో కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ రానున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన రాజ్ భవన్ కు నేరుగా కుటుంబంతో సహా చేరుకోబోతున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ తో పాటు మంత్రులు కూడా వెళ్లబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాత గవర్నర్ కు వీడ్కోలు పలికిన సీఎం జగన్.. ఈసారి కొత్త గవర్నర్ కు కూడా అదే రేంజ్ లో స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. దీంతో ఈ స్పెషల్ కార్యక్రమాల మర్మంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

గవర్నర్ కు సవాళ్ల స్వాగతం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి రిటైర్ అయ్యాక విశ్రాంతి తీసుకుంటున్న జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్.. తన కెరీర్లోనే తొలిసారిగా గవర్నర్ బాధ్యతలు చేపడుతున్నారు. కేంద్రం రాజకీయ నిర్ణయాల్లో భాగంగా ఆయన్ను గవర్నర్ గా పంపిందనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఏపీలో ఆయన ఎంట్రీకి సవాళ్లు స్వాగతం పలకబోతున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల ప్రక్రియ మధ్యలో ఉండటం, గవర్నర్ నిర్ణయాలు కీలకంగా మారనుండటం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఇవన్నీ గవర్నర్ కు సవాల్ గా మారబోతున్నాయి. ఆయా ప్రక్రియల్లో గవర్నర్ పాత్ర కీలకంగా మారబోతోంది.

జగన్ సర్కార్ కోటి ఆశలు ?
ఏపీలో కొత్త గవర్నర్ ఎంట్రీ ఈసారి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఇప్పటివరకూ గవర్నర్ గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ గతంలో సీనియర్ రాజకీయ నాయకుడు కావడంతో ప్రభుత్వాలను ఎలా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. కానీ ఈసారి గవర్నర్ గా వస్తున్న అబ్దుల్ నజీర్.. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి. రూల్ ప్రకారం పాలన సాగకపోతే, న్యాయపరంగా ప్రభుత్వం ముందుకెళ్లకపోతే కొరడా ఝళిపించే అవకాశాలూ లేకపోలేదు. అంతే కాదు తనను తొలిసారి గవర్నర్ ను చేసిన కేంద్రం చెప్పినట్లు ఆయన వినాల్సిందే. ఈ క్రమంలో జగన్ సర్కార్ తో కొత్త గవర్నర్ ఎలా వ్యవహరించబోతున్నారనే అంశంలో ఉత్కంఠ నెలకొంది.

హింట్ ఇచ్చిన కొత్త గవర్నర్ ?
అలాగే రాష్ట్రానికి గవర్నర్ గా కేంద్రం తనను నియమించగానే జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు రాష్ట్రంలో నేతలు పోటీ పడ్డారు. అయినా ఆయన వెంటనే అందరికీ అపాయింట్ మెంట్లు ఇచ్చేయలేదు. ముందుగా ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సౌరభ్ గౌర్ ను కలిసిన ఆయన.. ఆ తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రమే ఆయన్ను కలవగలిగారు. ఆ తర్వాత మిగతా వారికి ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో ఏపీ కొత్త గవర్నర్ నజీర్ బాధ్యతలు చేపట్టకముందే తన ప్రాధాన్యతలు చెప్పకనే చెప్పేశారన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications