రఘురామపై కేసులు ఇవే ! బయటపెట్టిన జగన్ సర్కార్ ! ఫిర్యాదులపై తేల్చనున్న హైకోర్టు ?
ఏపీలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి, ఆ పార్టీతోనే విభేధిస్తూ విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జగన్ సర్కార్ ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసినవి కొన్నయితే, అధికారులు, ఇతరులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైనవి కొన్ని ఉన్నాయి. అయితే వీటి వివరాలు మాత్రం అందుబాటులో లేవు. దీంతో వీటిలో ఏదో ఒక కేసును సాకుగా చూపి ఆయన్ను అరెస్టు చేస్తారనే భయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.

రఘురామపై కేసుల వ్యవహారం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సొంత పార్టీతో విభేదించడం మొదలుపెట్టాక రాష్ట్రంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇందులో తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆయన రాష్ట్రం వెలుపల ఉంటున్నారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో ఉంటూనే వైసీపీ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఈ కేసుల వ్యవహారంలో తాడోపేడో తేల్చుకోవాలని భావించడంతో వీటి వివరాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. రఘురామపై దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హోంశాఖ తాజాగా హైకోర్టుకు వివరాలిచ్చింది.

రఘురామపై 11 ఎఫ్ఐఆర్ లు
రెబెల్ ఎంపీ రఘురామపై ఏపీలో మొత్తం 11 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు హోంశాఖ హైకోర్టుకు తాజాగా వెల్లడించింది. గతంలో రఘురామ చేసిన విజ్ఞప్తి మేరకు వివరాలు అందించాలని ఆదేశించిన హైకోర్టు.. తాజాగా మరోసారి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేసుల సంఖ్యను మాత్రమే వెల్లడించింది. వివరాలు అందించేందుకు మరికొంత సమయం కావాలని కోరింది. దీంతో ఈ కేసుల పూర్తి వివరాలను అందించేందుకు ప్రభుత్వానికి మరింత గడువు ఇచ్చింది.

ఫిర్యాదులపై హైకోర్టు కీలక సూచన
అలాగే తనపై వివిధ పోలీసు స్టేషన్లపై దాఖలైన ఫిర్యాదుల వివరాలు కూడా కావాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ గతంలోనే కోరారు. ఈ విషయంలో ఆయనకు హైకోర్టు కీలక సూచన చేసింది. ఫిర్యాదుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తీసుకోవాలని సూచించింది. దీంతో ఆయన ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీటిని ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది ఇక్కడ తేలాల్సి ఉంది.

ఇవ్వాలో వద్దో తేల్చనున్న హైకోర్టు ?
అయితే రఘురామరాజుపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల వివరాలను పొందేందుకు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించిన హైకోర్టు.. వాటిని ఇమ్మని మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు. అదే సమయంలో వాటిని ఇవ్వాలో వద్దో తాము తేలుస్తామని రఘురామరాజు తరపు న్యాయవాదికి తెలిపింది. ఫిర్యాదులు నమోదై ఎఫ్ఐఆర్ కట్టని వాటి విషయంలో హైకోర్టు మరోసారి విచారణ నిర్వహించి తేల్చబోతోంది. ఇదంతా చూస్తుంటే ఇప్పటికే పీఎస్ లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా భవిష్యత్తులో తనపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రఘురామ భయపడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications