ముఖ్యమంత్రి జగన్ మహా ఘటికుడే... లౌక్యంలో కేసీఆర్ ను మించిపోయారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో పరిపక్వత చెందిన రాజకీయనేతగా వ్యవహరిస్తున్నారు. ఒకరకంగా లౌక్యంలో, రాజకీయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మించిపోయారని చెప్పవచ్చు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ స్వాగతం పలకలేదు. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను పంపించారు.
వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగానే చూడాలి!
రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. వ్యక్తిగతాన్ని వ్యక్తిగతంగానే చూడాలి. రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారుకానీ శత్రువులుండరు. కానీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణను కైవసం చేసుకోవడానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితితో భారతీయ జనతాపార్టీ ఢీ అంటే ఢీ అంటోంది. ఈ రెండుపార్టీల మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్లో తుపాకులు పేలుస్తున్నారు. మదగజాల్లా తలపడుతున్న ఈ పార్టీలమధ్య పరిస్థితి ఇలావున్న తరుణంలోనే మోడీ హైదరాబాద్లో అడుగుపెట్టారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకడానికి ఇష్టపడలేదు.
ప్రధానమంత్రికి భారీ స్వాగతం
హైదరాబాద్లో కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు భీమవరం చేరుకున్న ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారీ స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి స్టేజీ వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఆయన ఆతిథ్యానికి మోడీ కూడా ఖుషీఅయినట్లు ఆయన హావభావాలు వెల్లడించాయి.
చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ కూడా సామాజిక మాధ్యమాలద్వారా ప్రదానమంత్రికి స్వాగతం పలికారు. ఒకవైపు తెలంగాణలో ఎటువంటి ఆతిథ్యం ఇవ్వని కేసీఆర్.. మరోవైపు ఆతిథ్యంలో ముంచెత్తిన జగన్.. ఇలా ఈ రెండు అంశాలను సీనియర్ రాజకీయవేత్తలు విశ్లేషించారు.
స్వాగతం పలికివుంటే కేసీఆర్కే ప్లస్ అయ్యేది!!
ఆతిథ్యం ఇచ్చే అంశాన్ని, స్వాగతం పలికే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ చక్కగా సద్వినియోగం చేసుకున్నారని, మోడీ దగ్గర మంచి మార్కులు సాధించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రాజకీయ పరమైన విభేదాలున్నప్పటికీ వాటిని రాజకీయంగానే ఉంచి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ స్వాగతం పలికివుంటే అది ఆయనకే ప్లస్ పాయింట్ గా మారేదని, కానీ వ్యక్తిగత రాజకీయంగా కేసీఆర్ చూస్తున్నారంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏదేమైనప్పటికీ స్వాగత రాజకీయాల్లో లౌక్యంగా వ్యవహరించిన జగన్మోహన్రెడ్డే కేసీఆర్ పై పైచేయి సాధించారని భావిస్తున్నారు.