"ఇంత నిర్లక్ష్యమా? చంద్రబాబుకు బుద్ది, జ్ఞానం ఏమైనా ఉంటే!.."
ఇక్కడికి 100కి.మీ దూరంలో ఉన్న సీఎంకు ఈ కుటుంబాలను పరామర్శించాలన్న కనీస బాధ్యత కూడా లేదన్నారు.
నెల్లూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి నిర్లక్ష్య వైఖరి వల్లే నెల్లూరులో బాణసంచా పేలుడు ప్రమాదం చోటు చేసుకుందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. గతేడాది తూర్పుగోదావరి జిల్లాలోను ఇలాంటి ప్రమాదం జరిగిందని.. అయినా చంద్రబాబు మాత్రం కళ్లు తెరవలేదని, అందుకే నెల్లూరులో మరో దుర్ఘటన జరగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు నెల్లూరు బాణసంచా పేలుళ్ల బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. అనంతరం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఏటా ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నా.. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ మండిపడ్డారు.
బాణసంచా పేలుడు ఘటనలో గాయపడినవారు 80శాతం గాయాలతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని జగన్ అన్నారు. బాధితులు బతకడం కష్టమేనని వైద్యులు చెబుతున్నట్టుగా జగన్ వెల్లడించారు. ఇంత జరుగుతున్నా.. ఇక్కడికి 100కి.మీ దూరంలో ఉన్న సీఎంకు ఈ కుటుంబాలను పరామర్శించాలన్న కనీస బాధ్యత కూడా లేదన్నారు.
పేలుళ్లలో బాధితులంతా ఎస్టీ కమ్యూనిటీకి చెందినవారేనని జగన్ అన్నారు. ప్రభుత్వం ఐటీడీఏ నిధులు ఇవ్వకపోవడం.. ఎస్టీలకు సరైన ఉపాధి అవకాశాలు చూపించకపోవడం వల్లే వారు బాణసంచా తయారీ వంటి ప్రమాదకర పనులు చేస్తున్నారని తెలిపారు. రూ.200 రోజు కూలీ కోసం ప్రాణాలకు తెగించి ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు.
బాధితలకు డబ్బులు ముట్టజెప్పితే వారేమి మాట్లాడరని ప్రభుత్వం భావిస్తోందని జగన్ అన్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బాధితులకు సర్కార్ కనీస భరోసా కూడా కల్పించకపోవడం దారుణమన్నారు.
బాణసంచా తయారీ యూనిట్లలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తెలిసి కూడా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏను సమీక్షించాల్సిన ట్రైబల్ అడ్వైజరీ కమిటీని చంద్రబాబు వేయలేదన్నారు.
ఐటీడీఏ నిధుల సమీక్ష కమిటీలో ఎస్టీ ఎమ్మెల్యేలనే సభ్యులుగా నియమించాల్సి రావడం.. ఎస్టీ ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది వైసీపీ ఎమ్మెల్యేలు కావడంతోనే చంద్రబాబు కమిటీ వేయడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
చంద్రబాబుకు ఇప్పటికైనా కనీస బుద్ది,జ్ఞానం ఏమైనా ఉంటే వెంటనే బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
ఐటీడీఏ కమిటీ ఏర్పాటుతో పాటు దానికి నిధులు విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అన్నారు.