జగన్ ఢిల్లీ టూర్- చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు- అలాగైతేనే ఎన్డీయేలోకి.. ?
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోడీతో ఆయనకు అపాయింట్మెంట్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఆయన ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోడీతో జగన్ నేరుగా భేటీ కానుండటంతో ఇందులో చర్చకు వచ్చే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్పై సీబీఐ దర్యాప్తు కోరుతున్న జగన్.. ఈ అంశాన్ని కేంద్రంలో వైసీపీ చేరికతో ముడిపెట్టబోతున్నారా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కేంద్రంలో వైసీపీ చేరితో ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతున్నారనే దానిపైనా చర్చ జరుగుతోంది.
జగన్ ఢిల్లీ టూర్- ప్రధానితో భేటీ...
సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో ప్రధానితో ఏపీ సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. కరోనాకు ముందు పలుమార్లు ఢిల్లీ టూర్ ప్లాన్ చేసినా ప్రధాని అపాయింట్మెంట్ మాత్రం లభించలేదు. దీంతో ఈసారి ప్రధాని మోడీ, జగన్ భేటీ ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఎన్డీయే నానాటికీ బలహీనపడుతుండటం, ఏపీలో బీజేపీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్లో చర్చించబోయే అంశాలు రాష్ట్రంలోనూ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా విపక్ష టీడీపీకి అడ్డుకట్ట వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జగన్ ఆ పార్టీ అధినేత, విపక్ష నేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ను అమరావతి, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో సీబీఐ దర్యాప్తుతో ఎలాగైనా టార్గెట్ చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు కేంద్ర కేబినెట్లో వైసీపీ చేరికపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో జగన్ నిర్ణయం కీలకం కాబోతోంది.
కేంద్ర కేబినెట్లోకి వైసీపీ...
బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయంతో పటిష్టంగానే ఉంది. తాజాగా రెండు మిత్రపక్షాలు ఎన్డీయే నుంచి తప్పుకున్నా ప్రభుత్వ మనుగడకు వచ్చిన ఢోకా లేదు. అయినా రాజ్యసభలో వైసీపీ వంటి పరోక్ష మిత్రులపై ఆధారపడాల్సి రావడం బీజేపీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఎన్డీయే నుంచి ఇద్దరు మిత్రులు తప్పుకోవడంతో నైతికంగా విమర్శల బారిన పడిన బీజేపీ.. వ్యవసాయ బిల్లులకు బేషరతుగా మద్దతిచ్చిన వైసీపీని చేర్చుకోవడం ద్వారా వాటికి చెక్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్తో ఈ మేరకు ఫోన్లోనే చర్చించి మూడు పదవులు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు కేబినెట్ పదవులతో పాటు ఓ స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు మోడీ అంగీకరించినట్లు సమాచారం. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు...
ఏపీలో టీడీపీ హయాంలో రాజధాని పేరుతో జరిగిన భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో జరిగిన మరో స్కామ్పై ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇందులో రాజదాని భూముల కేసులో అప్పటి సీఎంగా చంద్రబాబుతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు, అలాగే ఫైబర్ గ్రిడ్ స్కాంలో అప్పటి ఐటీ మంత్రి లోకేష్పై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని వైసీపీ కోరుతోంది. అయితే కేంద్రం ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గత పార్లమెంటు సమావేశాల్లోనూ వైసీపీ ఎంపీలు ఏకంగా పార్లమెంటు బయట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదే అంశాన్ని సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్షాతో తాజాగా జరిగిన భేటీలో ప్రస్తావించారు. దీనిపై అమిత్షా సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరినట్లు ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి ప్రధాని మోడీతో భేటీలోనూ జగన్ సీబీఐ దర్యాప్తుకు పట్టు బట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Recommended Video
ఎన్డీయేలో చేరికకు సీబీఐ దర్యాప్తుకు ముడిపెడతారా ?
మరోవైపు ఎన్డీయేలో చేరికకు బీజేపీ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో జగన్ తన కీలక డిమాండ్ అయిన చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తును దానికి ముడిపెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. వైసీపీ ఎన్డీయేలో చేరారంటే చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించాలని మోడీని జగన్ కోరతారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. గతేడాది ఎన్నికల్లో్ ఘోరపరాజయం తర్వాత కుదేలైన టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ చేయాలంటే తండ్రీ కొడుకులపై సీబీఐ దర్యాప్తు చేయాలని, అప్పుడు తాము వైసీపీలో చేరినా ప్రత్యర్ధులు ఉండరనే విషయాన్ని జగన్ మోడీ దృష్టికి తీసుకెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ జగన్ ఇదే అంశం మోడీకి చెప్పినా ఆయన ఈ వాదనకు అంగీకరిస్తారా అన్నది అనుమానమే. దీంతో జగన్-మోడీ భేటీపైనే ఇప్పుడు అందరీ కళ్లూ ఉన్నాయి.