‘జగతి’లో యాక్సిస్ క్లినికల్స్ పెట్టుబడులపై వాదనలు విన్న ప్రత్యేక కోర్టు: విచారణ 5కి వాయిదా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్లో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్(యాక్సిస్ క్లినికల్స్) పెట్టిన రూ.7 కోట్ల పెట్టుబడుల్లో కంపెనీల చట్టంలోని నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) దాఖలు చేసిన ఫిర్యాదులపై ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రవీణ శుక్రవారం విచారణ జరిపారు.
జగతి పబ్లికేషన్స్లో యాక్సిస్ క్లినికల్ పెట్టుబడులకు సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్ 372ఎ(1), 628, 629 కింద నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆర్వోసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
జగతిలో పెట్టుబడులు పెట్టడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని, పారదర్శకంగానే నిబంధనలకు అనుగుణంగానే పెట్టుబడులు ఉన్నాయని యాక్సిస్ క్లినికల్ తరఫు సీనియర్ న్యాయవాది రఘునందన్ తెలిపారు.
ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే జరిమానా విధించే అవకాశం ఉందని, ప్రాసిక్యూషన్ అవసరంలేదని చెప్పారు. వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.