బాబుపై ఎగిరిపడ్డ అంబటి, టీ బిల్లుపై జైపాల్రెడ్డి పుస్తకం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు సొంత పనుల కోసమే సింగపూర్ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. అక్కడ ఆయనకు చెందిన వ్యాపారాలు, హోటళ్లు ఉన్నాయని గతంలో తెహల్కా పత్రిక వెల్లడించిందన్నారు.
ఆయన హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, సింగపూర్ల బంధం దృఢమైనదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే బాగుంటుందని విమర్శించారు. అసలు సింగపూర్ పర్యటనకు ఇన్ని అర్భాటాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అంటూ ప్రజలను చందాలు అడుగుతున్నారని, మరోవైపు, ఇటు సింగపూర్ వెళ్లేందుకు రెండు ప్రత్యేక విమానాల్లో వెళ్లారని ధ్వజమెత్తారు. కాగా, ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.
తెలంగాణ బిల్లు ఆమోదంపై జైపాల్ రెడ్డి పుస్తకం!
కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత జైపాల్ రెడ్డి పుస్తకం రాస్తున్నారట! తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా జరిగిన పరిణామాలు, పలువురు నేతలు వ్యవహరించిన తీరు తదితర అంశాలతో పుస్తకం రాస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
బిల్లు ఆమోదం పొందే సమయంలో జరిగిన అనేక విషయాలు ప్రజలకు తెలియవని, ఎన్నో రహస్యాలు దాగున్నాయని జైపాల్ వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే పుస్తకం రాస్తే బాగుండదనే ఆగినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ఈ పుస్తకం తీసుకు వస్తానని చెప్పారు.
రేవంత్ పైన జగదీశ్వర్ రెడ్డి నిప్పులు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి పైన తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తామన్న రీతిలో మాట్లాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. టీడీపీ నేతలవి అసత్యాలను ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబులా దొంగదారిలో రాజకీయాల్లోకి రాలేదన్నారు.