పవన్ కళ్యాణ్ కృతనిశ్చయం..! అందుకే హస్తిన పయనం.. !!
అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కాదు రాజధాని అంశంలో కూడా రూటు మార్చారు. అధికార వైసిపి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడుతుందని ఆరోపించడమే కాకుండా, ఆ పార్టీకి సమాధానం చెప్పేందుకు గేరు మార్చి వేగవంతమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు జనసేనాని. రాష్ట్ర పరిస్ధితులను కేంద్రానికి వివరించడమే కాకుండా పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కేంద్ర బీజేపి పెద్దలకు విజ్ఞప్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు, రాజధాని అంశం పట్ల పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
అమరావతిపై పవన్ సీరియస్.. తరలింపుపై కేంద్ర పెద్దలతో మంతనాలు..
అమరావతి రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలు రేపుతూనే ఉంటాయి. కృష్ణా, గుంటూరు రాజకీయాలు మరీ పరాకాష్టగా కొనసాగుతుంటాయి. ఈ రెండు జిల్లాలలను కలుపుతూ నెలకొల్పిన అమరావతి రాజధాని ప్రస్తుత వైసిపి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిష్టంభన ఎదుర్కొంటోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నడిమధ్యలో ఉండే విధంగా రాజధానిని గత తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత శంఖుస్దాపన కూడా చేయించారు మాజీ సీఎం చంద్రబాబు. కాని తర్వాత జరిగిన రాజకీయ పరిణామల వల్ల సాక్షాత్తూ ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన అమరావతి శంఖుస్థాపన అగమ్యగోచరంగా మారింది.
పలు అంశాల పట్ల కేంద్రంతో చర్చలు.. నేడు ఢిల్లీలో పవన్ బిజీబిజీ..
ప్రపంచ స్దాయి రాజధానిని నిర్మిస్తే భావితరాలకు సంపదనిచ్చే వనరుగా మారుతుందని గత సీఎం చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్దాలుగా వైసిపీ ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. కొన్ని వర్గాల అభ్యన్నతికోసం చంద్రబాబు నాయుడు రాజధానిని నిర్మిస్తున్నారు తప్ప అందులో హేతుబద్దత లేదని ఆరోపిస్తున్నారు వైసిపి నేతలు. అంతే కాకుండా టీడిపి ప్రతిపాదించిన అమరావతి, రాజదానికి అణువైన ప్రాంతం కాదని కొన్ని కమిటీలు స్పష్టం చేసాయి. దీంతో పాటు రాష్ట్రం నలుమూలలా అభివృద్ది చెందాలంటే మొదట అధికార వికేంద్రీకరణ జరగాలని వైసీపి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అందుకోసం రాజధానిని విభజిస్తే తప్పేముందని వాదిస్తోంది. ఏపి లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సరిగ్గా ఇదే నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
మూడు రాజధానులు వద్దు.. కేంద్రానికి వివరించనున్న జనసేనాని...
భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. మొన్నటి వరకూ ఒంటరి పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ బీజేపితో జత కట్టిన తర్వాత తన వేగాన్ని మరింత పెంచినట్టు తెలుస్తోంది. బీజేపి తో 2014 నుండి అవినాభావ సంబంధం కలిగి ఉన్న పవన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించేందుకు ప్రణాళిక రచించారు. ముఖ్యంగా రాజదాని అంశంలో కొనసాగుతున్న గందరగోళాన్ని నిలువరించాలని కేంద్ర బీజేపి నేతలకు వివరించబోతున్నారు. ఆర్దిక లోటులో ఉన్న రాష్ట్రం ప్రయోగాలపాలతై అధోగతి తప్పదని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ మంత్రులతో కీలక చర్చలు.. జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేయనున్న గబ్బర్ సింగ్..
బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత రొండోసారి ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావదేకర్, అమీత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ కాబోతున్నారు. అమర వీరుల కుటుంబాలకు ఆర్దిక సహాయం కార్యక్రమాన్ని హైలైట్ చేస్తున్న జనసైనికులు అసలు అంశం వేరే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలు, రైతుల మీద నమోదైన కేసులు, ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారలతో పాటు కీలకమైన రాజధాని అంశాన్ని కేంద్ర పెద్దలతో చర్చించేందుకు పవన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు నిర్ణయంతో పరిశ్రమలు తరలి వెళ్తున్న అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకురావాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న పనిణామాల పట్ల కేంద్రంలో కదలిక తెచ్చే్ందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.